విజయవాడ: టీడీపీ చంద్రబాబుపై కోపంతోనే సీఎం జగన్ రాజధానిని విచ్ఛినం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కోపాలకు ప్రజలు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం సబబు కాదన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ చెప్పిన నివేదికే జీఎన్. రావు కమిటీ రాసి ఇచ్చిందని విమర్శించారు. విజయవాడ కేంద్రంగా రాజధాని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు చోట్ల ఉంటే పరిపాలన సాధ్యం కాదన్నారు. హైకోర్టు ఏర్పాటుతో రాయలసీమ అభివృద్ధి కాదని చెప్పారు. చంద్రబాబు చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువని.. బాబుపై కోపంతోనే జగన్ రాజధానిని విచ్ఛినం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రత్యేకమైన రాజకీయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. జగన్, చంద్రబాబు బరిలోకి దిగితే తాను రిఫరీగా ఉంటానని వ్యాఖ్యానించారు.
మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఓ జోక్ అని నారాయణ అన్నారు. మంత్రుల మాటలకు విలువ లేదని కొట్టిపారేశారు.