(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని పలువురు నేతలు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ఎబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఇది కేవలం కక్షసాధింపు ధోరణిలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్షన్ ధోరణితో ముందుకు పోతున్నట్లున్నదని రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే అధికారుల్లో అభద్రతాభావం నెలకొంతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన కక్షసాధింపు వైఖరిని మానుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
టీడీపి నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ పాలన కక్ష్యలు, కార్పణ్యాలతో, ఈర్ష్య ద్వేషాలతో సాగుతున్నదని విమర్శించారు. చంద్రబాబుని టార్గెట్ చేసి, ఆయన అనుచరగణాన్ని సాధించడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. ‘చంద్రబాబుకు సన్నిహితంగా పనిచేసినవారిని ఇబ్బందిపెట్టడం తగునా? సాధారణ పరి పాలన గాలికొదిలి కార్పణ్యంతో సాగడం ప్రజాస్వామ్యమా? ఏమిటి?’అని వర్ల ప్రశ్నించారు.
కాగా ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై విజయవాడ ఎంపి కేశినేని నాని విన్నూత్నంగా స్పందించారు. సన్మానం చేస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
‘మీరు ముఖ్యమంత్రి అవ్వటానికి, మీ పార్టీ వైసీపీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!’అంటూ నాని వ్యాఖ్యానించారు.