అమరావతి : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గత అయిదున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తూనే వస్తున్నదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన చట్టం హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. కనీసం కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధులు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. 2014 రాష్ట్ర రెవెన్యూ లోటు బడ్జెట్ నిధులు రూ. 18,970 కోట్లు కేంద్రం ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వలేదని అన్నారు.
జగన్మోహన రెడ్డి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులను కలిశారనీ, అయన ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించాలనీ రామకృష్ణ డిమాండ్ చేశారు.