‘సీఎం జగన్ ను వెనకుండి నడిపిస్తోంది విశాఖ శారదాపీఠం.. ఆయన సూచన మేరకే విశాఖ రాజధానిగా జగన్ ప్రకటించారు.. స్వరూపానంద స్వామి ఆశీస్సులు, సలహాలు జగన్ తీసుకుంటారు..’ ఇవన్నీ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. జగన్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం.. జగన్ పై స్వామి ప్రేమ చూపించడం కూడా ఇందుకు కారణమయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరి మధ్య అంత సఖ్యత ఉందా..? అనే అనుమానాలు అవే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇందుకు కారణం.. చిన స్వామి.. స్వాత్మానందేంద్ర ఢిల్లీ టూర్, బీజేపీ పెద్దల్ని కలవడం. పీఠం పరంగా ఏదైనా కార్యక్రమం ఉంటేనే తప్ప స్వయంగా పీఠాధిపతి కదలరు. కానీ.. స్వయంగా చిన స్వామి చేపట్టిన ఈ టూర్ వెనుక పెద్ద రాజకీయ తతంగమే ఉందని తెలుస్తోంది.
బీజేపీ నేతలను కలవడంలో అంతర్యం ఏంటో..
త్వరలో ఏపీలో జరిగే తిరుపతి ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చిన స్వామి ఈ యాత్ర చేపట్టారని సమాచారం. ఆమేరకు ఢిల్లీ బీజేపీ పెద్దలే వీరిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ బలపడటం, తిరుపతి ఉప ఎన్నికలో హిందూత్వం ప్రచారం తీసుకొచ్చి బీజేపీ గెలవాలనే ప్లాన్ లో భాగమే ఇదంతా అంటున్నారు. మరోవైపు.. ఏపీలో జరుగుతున్న మత మార్పిడులు కూడా పీఠం దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. పీఠం వేదికగా హిందువులను ఏకం చేయాలనే డిమాండ్లతో స్వాత్మానందేంద్ర స్వామి కూడా ఢిల్లీ యాత్రను ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు.. చినస్వామి ఢిల్లీ యాత్ర చుట్టూ రాజకీయం ఉందనేది మరో మాట. రాజకీయంగా జగన్ కు మద్దతిచ్చే పీఠం.. ఈసారి బీజేపీ పెద్దలను కలవడం పలు రకాల ప్రశ్నలకు తావిస్తోంది.
జగన్ తో బేధాభిప్రాయాలు వచ్చాయా..?
తిరుపతి ఉప ఎన్నికకు ముందే తానో ప్రకటన చేసి తిరుపతి వేదికగా భారీ హిందూ సమ్మేళన కార్యక్రమం చేయాలనేది స్వాత్మానందేంద్ర స్వామి ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకు బీజేపీ మద్దతు స్వామీజీకి, హిందూత్వాన్ని తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రయోగించేందుకు స్వామీజీ మద్దతు బీజేపీకి అవసరం పడిందని సమాచారం. ఇందులో భాగంగానే జగన్ కు స్వామీజీకి మధ్య బేధాభిప్రాయాలు ఏమైనా వచ్చాయా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో స్వాత్మానందేంద్ర బీజేపీ పెద్దలను కలవడం వెనుక ఆంతర్యం తిరుపతిలో బీజేపీని గెలిపించి హిందూత్వం పట్టు నిలిపేలా, ప్రాధాన్యం ప్రజలకు తెలిసేలా అయితే ఓకే. కానీ.. వైసీపీని ఢీ కొట్టేందుకే అయితే మాత్రం జగన్-స్వామి మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టే..!