ఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో చెవిటి,మూగ దళితులే ఉన్నత పదవులను పొందగలరని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు.
మంగళవారం ఉదిత్ రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బిజెపిలో చెవిటి మూగ దళితులు ఉన్నట్లయితే వారు అగ్ర స్థానాన్ని పొందవచ్చు. మొదట వారు ఒక దళితున్ని పార్టీ అధ్యక్షున్ని చేశారు. ఇప్పుడు ఆ దళితున్ని దేశ అధ్యక్షున్ని చేశారు. నేనూ చెవిటి వాన్నో, మూగ వాన్నో అయితే నన్ను కూడా ప్రధాన మంత్రిని చేసేవారు ‘అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘2014 మే 20న రామ్నాథ్ కోవింద్ తన బయోడేటాతో నా దగ్గరికి వచ్చారు. పార్టీలో తనకు గుర్తింపు ఇచ్చే విధంగా ఏదైనా పదవి కోసం సిఫారసు చేయమని నన్ను అడిగారు. నేను ప్రయత్నించాను కానీ ఫలితం లేదు. అయితే కొంత కాలం తర్వాత ఆయన గవర్నర్గా, రాష్ట్రపతిగా నియమించబడ్డారు’ అని ఉదిత్ రాజ్ చెప్పారు.
‘ప్రధాని నరేంద్ర మోది పాలనలో దేశం సురక్షితంగా ఉందని బిజెపి నేతలు చెప్తున్నారు. ఉండి ఉంటే 350 కేజీల పేలుడు పదార్థాలను ఎలా ఉపయోగించారు? ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? వారి మేధస్సుతో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కండోమ్లు కనుగొన్నారు గానీ పేలుడు పదార్థాలను గుర్తించలేక పోయారు’ అని పుల్వామా ఉగ్రదాడి ఉదంతాన్ని ఉద్దేశించి ఉదిత్ రాజ్ విమర్శించారు.
ఢిల్లీ వాయువ్య లోక్ సభ టికెట్ కేటాయించకపోవడంతో ఉదిత్ రాజ్ గత వారమే బిజెపిని వీడి కాంగ్రెస్లో చేరారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?