Delhi : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొంత కాలం నుండి దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు ఢిల్లీలో ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ ఉన్నాయి.
కార్పొరేట్ బడాబాబులకు మేలు చేకూర్చడానికి దేశంలో ఉన్న రైతులను మోసం చేస్తున్నట్లు.. నూతన వ్యవసాయ చట్టాలు ఆ విధంగా ఉన్నట్లు అనేకమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే 72వ రిపబ్లిక్ డే వేడుక నాడు రైతులంతా కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన క్రమంలో ..పోలీసులకు మరియు నిరసనకారులకు మధ్య తీవ్ర తోపులాట మాత్రమేకాక లాఠీచార్జి రీతిలో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే విధంగా పరిస్థితి మారటంతో ఉద్యమకారుడు చనిపోవడం జరిగింది.
దీంతో ఢిల్లీలో హోంశాఖ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయడం జరిగింది. రైతు ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో… ఢిల్లీ నగర శివార్లలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రైతులు పోలీసు వాహనాలను తగలబెట్టడం కాక వారిని తరుముతూ ఢిల్లీ రోడ్లపై పరిగెత్తించారు. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.