అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుగుదేశం పార్టీ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విజయవాడ ఎంపి కేశినేని నాని అనూహ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
వారి మధ్య బేధాభిప్రాయాలు టీ కప్పలో తుఫానేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న నందిగామ నియోజకవర్గంలో జరిగిన దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఐదవ వర్ధంతి కార్యక్రమాలలో ఇద్దరు నేతలు కలిసి పాల్గొన్నారు. వీరిద్దరి మద్య కోల్డ్ వార్ ఉందంటూ ప్రచారం జరగడం, దానికి తగ్గట్లుగానే కేశినేని ఫేస్ బుక్ పోస్టులు ఉండటంతో వారి మధ్య వివాదం నిజమేనని భావించారు.
టిడిపి పార్లమెంటరీ విప్ పదవి తిరస్కరించిన నాని తన అసంతృప్తిని ఫేస్ బుక్ పోస్ట్ ల ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నానిని బుజ్జగించేందుకు స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి ఆయనతో చర్చలు జరిపారు. అయినప్పటికీ నాని మెత్తపడలేదనీ, విప్ పదవి స్వీకరించడానికి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. దేవినేని ఉమా వ్యవహారశైలిపైనా చంద్రబాబు వద్ద నాని ప్రస్తావించారని వార్తలు వచ్చాయి.
నాని అలక వ్యవహారం టిడిపి నేతలకు తలనొప్పిగా మారింది. ఈ నేపధ్యంలో దేవినేని ఉమాతో కలసి నాని కార్యక్రమాలలో పాల్గొనడం చర్చనీయాంశమయ్యంది. వీరిద్దరి మధ్య వ్యవహారాలు ఎలా ఉన్నా కలసి కార్యక్రమాల్లో పాల్గొనడంపై తెలుగుతమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.