ఏపీలో దేవాలయాలపై దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఏకంగా రాష్ట్రపతికి కూడా ఈ అంశంపై లేఖలు వెళ్లాయి. ఓపక్క ఈ అంశం మతం రంగు పులుముకుంది.. మరోపక్క ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఇంకోపక్క పోలీసులకు ఈ కేసులు సవాల్ గా మారుతున్నాయి. ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినడం ఇక్కడ ముఖ్యం కాదు. అశాంతి, మత ఘర్షణలు, అల్లకల్లోలం, రాజకీయాలు, శాంతిభద్రతలు.. ఇలా చాలా అంశాలు ఇటువంటి దారుణాల చుట్టూ ముడిపడి ఉంటాయి. ఎటు చూసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరిని నిందిస్తే గానీ.. ఉనికి లేని రాజకీయాలకు దేవాలయాలపై దాడులు, దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం ముడిసరుకుగా మారింది. దీంతో సహజంగానే అధికార పార్టీపై విపక్షాలు దాడి చేస్తున్నాయి. పోలీస్ వ్యవస్థపై కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో పోలీస్ శాఖ స్పందించింది.
పోలీస్ బాస్ సీరియస్..
ఆలయాల ఘటనలపై ఏపీ పోలిస్ బాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో ఏం జరుగుతుంది.. గతంలో ఏం జరిగింది.. తాము ఏం చేయబోతున్నాం.. అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. పనిలోపనిగా తమపై విమర్శలు చేస్తున్నవారికి సమాధానంతోపాటు ఘాటు హెచ్చరికలు కూడా చేశారు. ఏపీలోని ఆలయాల్లో కొన్నేళ్లుగా జరుగుతున్న ఘటనలు.. వాటి లెక్కలను వివరించారు. ఇవన్నీ చూస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత ఈ తరహా ఘటనలు జరగడం లేదని అర్ధమవుతోంది. రాష్ట్రం వేరుపడినప్పటి నుంచీ జరుగుతున్న దాడులపై అప్పట్లో ఇంత అల్లర్లు జరగలేదు అనేది స్పష్టం అవుతోంది. అధికారం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టేందుకు ఈ అంశాల్ని రాజకీయంగా ఉపయోగిస్తున్నారని చెప్పాలి. నిజానికి పోలీసులకు సవాల్ గా మారాల్సిన ఈ అంశం.. వారిపై ఒత్తిడి తెస్తోంది. రాజకీయ క్రీడలో పోలీసులు మాటలు పడుతున్నారు. పైగా.. పోలీసులపై కూడా మతం రంగు పులుముకోవడం చర్చనీయాంశం అవుతోంది. దీనిపైనే డీజీపీ గౌతమ్ సవాంగ్ విపక్షాలకు గట్టి కౌంటరే ఇచ్చారు.
వరుసగా ఏ ఏడాది-. ఎన్ని ఘటనలు..!
2015లో 163, 2016లో 207, 2017లో 139, 2018లో 123, 2019లో 177, 2020లో 143, 2021లో 006 వరకూ దేవాలయాలపై దాడులు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 5వ తేదీ 2020 నుంచి దేవాలయాల్లో ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు డీజీపీ. అప్పటినుంచీ ప్రధానమైన కేసులుగా 44 నమోదైతే అందులో 29 కేసుల్లో 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులు, ముఠాలను అరెస్ట్ చేశామని వివరించారు. మరో 15 కేసుల్లో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 2020 నుంచి నేటి వరకు మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఆలయాలపై దాడులకు పాల్పడటం వంటి సంఘటనలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 4,614 మందిని అరెస్టు చేశామన్నారు.
దేవాలయాల్లో తీసుకుంటున్న చర్యలు..
‘జనవరి 12, 2021 నాటికి మొత్తం 13,089 ప్రార్థనా మందిరాల్లో 43,824 సీసీ కెమెరాలు.. సెప్టెంబర్ 5, 2020కి ముందు 3,697 ప్రార్థనా మందిరాల్లో 13,273 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 58,871 ప్రార్థనా మందిరాలను సీసీ కెమెరాల నిఘాతో జియోట్యాగింగ్ చేశాం. ఆలయాల రక్షణ కోసం విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటివరకూ 15,394 మందిని నియమించడమే కాదు.. మరో 23,256 మందిని నియమించబోతున్నారు. మరో 7,862 మంది నియామకం కోసం కసరత్తు జరుగుతోంది. రామతీర్ధం ఆలయంలో మొత్తం 16 సీసీ కెమెరాలున్నాయి. ఇప్పుడ మరో 16 కొత్త కెమేరాలు కోరారు. రామతీర్థంకు 2 కిమీల దూరంలో ఉన్న గుట్టపై చిన్న గుడి ఉంది. అక్కడా కెమెరాలు పెట్టాలి. కానీ కరెంట్ లేకపోవడం వల్ల సాధ్యం కాలేదు. విగ్రహ ధ్వంసానికి 3 రోజులు ముందు కరెంట్ ఇచ్చారు. 4 సీసీ కెమెరాలు పెట్టడానికి ముందు ఘటన జరిగింది. రామతీర్ధం లో ఘటనపై సీఐడీ దర్యాప్తు, సిట్ దర్యాప్తు జరుగుతున్నాయి. అంతర్వేది రథం దహనం ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరడం జరిగింది’ అని వివరించారు. ఇలా పోలీసులు తమ పని తాము చేస్తుంటే వీరికి మతాలను అంటగట్టడం తగని పనే. ఈ విషయంలో తామెంత సీరియస్ గా ఉన్నామో డీజీపీ క్లారిటీ ఇచ్చినట్టైంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?