ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తన అధ్యక్షతన అమరావతిలో గత నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
3 జిల్లాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా అరకును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే అంశంపై కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. అయితే, ఈ పరిణామం శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మైలేజీని పెంచిందంటున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎస్ నేతృత్వంలో అధికారులతో కూడిన అధ్యయన కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఎమ్మెల్యే కీలక ప్రతిపాదన చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవద్దని ధర్మాన ప్రసాదరావు ఏకంగా పార్టీ సమావేశంలోనే ప్రకటించారు. జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని శ్రీకాకుళం పరిధిలోనే ఉంచాలని ధర్మాన ప్రసాదరావు కోరారు. ఆయన డిమాండ్ చేసిన సమయంలో హాట్ టాపిక్గా మారినప్పటికీ, సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
ధర్మాన డిమాండ్ అనంతరం దీనికి తగు కారణాలు ప్రభుత్వం అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో ఎచ్చెర్ల కీలక భూమిక పోషిస్తోంది. పలు ఫార్మా కంపెనీలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అంబేద్కర్ యూనివర్శిటీ కూడా ఉంది. పలు ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉండటంతో జిల్లాకు ఆదాయవనరుగా ఈ ప్రాంతం ఉంది. దీన్ని విజయనగరానికి ఇచ్చేస్తే సిక్కోలు జిల్లాకు ఇక్కట్లు తప్పవన్న ఫీడ్ బ్యాక్ రావడంతో సీఎం జగన్ తన నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు సమాచారం.
మరోవైపు, ధర్మాన సోదరుడైన మంత్రి కృష్ణదాస్ సైతం ఈ మేరకు సీఎం జగన్ వద్ద ఎచ్చెర్ల ఆవశ్యకతను తెలియజేశారని సమాచారం. ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా అభివృద్ధికి ఎచ్చెర్ల సహకరించే విధానం, ఆ నియోజకవర్గం జిల్లా పరిధి మార్చడం వల్ల ఎదురయ్యే సమస్యలను ఆయన వివరించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ సిక్కోలులోనే ఎచ్చెర్ల ఉంచేందుకు డిసైడయ్యారట. మొత్తంగా ధర్మాన బ్రదర్స్ వల్ల సిక్కోలుకు గుండెకాయ వంటి నియోజకవర్గం అక్కడే ఉందని అంటున్నారు.