బాన్సువాడ: రాష్ట్రంలో కేసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ భట్టి మంగళవారం బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను తక్షణం అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరినట్లు ఆయన చెప్పారు.
కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేస్తామని ఫిరాయింపు నేతలు ప్రకటన చేయడాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ను ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్లో ఎలా విలీనం చేస్తారని భట్టి ప్రశ్నించారు.
పార్టీ విలీనం అంటే సామాన్యమైన ప్రక్రియ కాదని భట్టి అన్నారు. గతంలో కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసే సమయంలో గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకు అందరి తీర్మానాలను ఎన్నికల కమిషన్కు పంపి, ఆ తర్వాత విలీనం చేయడం జరిగిందని చెప్పారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ విప్ ఈరవత్రి అనిల్లు భట్టి బిక్రమార్కతో పాటు స్పీకర్ను కలిసిన వారిలో ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?