టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు రాజకీయాల్లో పరిణితి సాధిస్తున్నాడనే ఆనందం తెలుగుతమ్ముళ్లలో కనిపిస్తుండగా మరో వైపు ఆయన ఎక్కడ అడుగు పెడితే పార్టీలో అసమ్మతి కూడా బయటపడుతోంది.రాష్ట్రంలో వరదలు సంభవించిన నేపథ్యంలో లోకేశ్ విస్తృత పర్యటనలు సాగిస్తున్నారు. వరద తాకిడికి గురయిన జిల్లాల పర్యటనలకు దూసుకు వెళుతున్నారు.ఈ సందర్భంగానే ఆయా జిల్లాల్లో టిడిపిలో ఉన్న వర్గ విబేధాలు కూడా బహిర్గతమవుతున్నాయి.మొన్నటికి మొన్న లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన సాగించినప్పుడు జేసీ బ్రదర్స్ ను వెంటేసుకొని తిరిగారు.ఇది జేసీ వ్యతిరేక వర్గీయులకు ఏమాత్రం నచ్చలేదు.
2014 లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేంతవరకు జేసీ బ్రదర్స్ టీడీపీని అనంతపురం జిల్లాలో అణిచి వేశారని,ఆ పార్టీ వారిని ముప్పుతిప్పలు పెట్టారని జేసీ వ్యతిరేక వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ మంత్రిగా వుండగా జేసీ దివాకర్ రెడ్డి టిడిపిని ఎన్ని విధాలుగా దూషించాడో లోకేష్ కు తెలియదా అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.ఆది నుండి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉండి అనేక ఇబ్బందులకు గురైన అసలు సిసలు తెలుగు తమ్ముళ్లను కాదని నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన జేసీ కుటుంబానికి లోకేశ్ అంత ప్రాధాన్యం ఇవ్వడం ఏమాత్రం సరికాదని వారు బహిరంగంగానే అంటున్నారు.ప్రభాకర్ చౌదరి, కాలువ శ్రీనివాసులు, పల్లె రఘునాథ రెడ్డి తదితరులంతా లోకేష్ చర్యల పట్ల రుసరుసలాడుతున్నారు.ఇక తాజాగా లోకేష్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆ జిల్లాకు చెందిన మాజీ దళిత మంత్రి పీతల సుజాత ఎక్కడా కానరాలేదు.చంద్రబాబు ఏరికోరి 2014 లో ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న దళిత నేతల్లో సుజాత ముఖ్యమైన నాయకురాలే .ఆమె రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.చంద్రబాబు మధ్యలో మంత్రిపదవి తీసేసినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వకపోయినప్పటికీ సుజాత టిడిపికి విధేయురాలిగానే ఉన్నారు.అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ పరంగా అనేక పదవులను చంద్రబాబు భర్తీ చేసినప్పటికి మాజీమంత్రి దళిత నాయకురాలు సుజాతను పూర్తిగా పక్కన పెట్టేశారు.పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న చింతమనేని ప్రభాకర్,మాగంటి బాబు తదితరులు సుజాతను తొక్కేశారంటారు.విషయం చంద్రబాబుకు తెలిసినప్పటికీ ఆయనేమీ పట్టించుకోని నేపథ్యంలోనే సుజాత అలకపాన్పు ఎక్కారని ఆమె బీజేపీ వైపు చూస్తున్నారని కూడా టాక్ ఉంది.లోకేష్ పర్యటనకు గైర్హాజరు కావడంతో ఆమె వైఖరి స్పష్టమైపోయింది.ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లో కూడా ఉందని ఇప్పటికైనా చంద్రబాబు లోకేషు లు జాగ్రత్త పడితే మంచిదని రాజకీయ పరిశీలకులు సలహా ఇస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?