మంత్రి పోస్టు కంటే ఎంపీ పదవి పెద్దదేం కాదు.మంత్రులుగా ఉన్న ఇద్దరిని జగన్ రాజ్యసభకు పంపి వారికేదో మేలు చేశారని వైసీపీ వర్గాలు భావిస్తుంటే ఇందుకు భిన్నమైన రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
నిజానికి వారిద్దరూ బలిపశువులయ్యారు అంటున్నారు.వ్యూహాత్మకంగానే ముఖ్యమంత్రి జగన్ ఆ ఇద్దరు బీసీ మంత్రులను రాజ్యసభకి పంపి తన మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఆ ఇద్దరూ ఎవరు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. నిజానికి వీరు ఇద్దరూ కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. కానీ జగన్ చేరదీసి పెద్దల సభ ద్వారా మంత్రులను చేశారు.ఇంతవరకూ బాగానే ఉంది .అయితే మూడు రాజధానుల బిల్లును శాసనమండలి తిప్పి కొట్టడాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దాంతో ఆయన మూడవ కన్ను తెరచి మండలి రద్దు అనేశారు.ఆ ప్రక్రియను కూడా ప్రారంభించేశారు అసెంబ్లీలో తీర్మానం సైతం చేశారు.తుది నిర్ణయం కోసం కేంద్రానికి ఆ తీర్మానం పంపారు
కానీ మండలి మాయం కాలేదు, దాని ఆయువు అలాగే ఉంది.కేంద్రం చేతిలోనే కధ అంతా ఉంది. మరి కేంద్రం మండలి రద్దు అనడంలేదు.మండలి రద్దు జరగలేదు కానీ మంత్రుల పోస్టులు మాత్రం ఊడిపోయాయి. పిల్లి, మోపిదేవి గట్టిగా సీట్లో కూర్చుని ఏడాది అయినా కాకముందే వారిని ఢిల్లీ బాట పట్టించారు జగన్. బీసీనేతలు అంటూ రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించినా మంత్రుల కంటే అది ఎక్కువ కాదన్న మాట ఇపుడు వారు అనుచరుల్లో వినిపిస్తోంది
ఇక మండలి రద్దు అన్న తరువాత పెద్ద తతంగమే ఉందని జగన్ కి తెలుసు. కానీ ఆదరాబాదరాగా ఇద్దరు మంత్రులను పెద్ద సభకు ఢిల్లీకి పంపించేయాలని జగన్ చూడడం వెనక వారి మీద ప్రేమతో పాటు మరో రకమైన రాజకీయం ఉందని ఇపుడు వినిపిస్తున్న మాట. వైసీపీలో మంత్రి పదవులు లేక జనం అల్లాడుతున్నారు. పైగా జగన్ రెండున్నరేళ్ళు కాలపరిమితి పెట్టారు. అసలే ఆశావహులు ఎక్కువ. ఇలా మూతి బిగించేయడంతో ఎక్కడికక్కడ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ సీఎం కావాలని సొంత సామాజికవర్గం రెడ్లు ఎంతో త్యాగం చేసారు. సామాజిక సమీకరణల పేరిట వారికి చెక్ పెట్టేశారు. దాంతో బయట పడని అసంతృప్తి చాలానే ఉందని గ్రహించే జగన్ ఈ ఇద్దరు మంత్రుల ఖాళీలను క్రియేట్ చేశారని అంటున్నారు.
ఇక తాను అన్న మాట తప్పకుండా ఇద్దరు మంత్రుల రాజీనామాలను చూపిస్తూ మొత్తం విస్తరణకే జగన్ పూనుకుంటున్నారని అంటున్నారు. అలా చేయడం వల్ల మరికొంతమందికి మంత్రి పదవులు అవకాశంగా వస్తుందని అంటున్నారు. రెండున్నర ఏళ్ల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముందు చెప్పిన జగన్ ఇప్పుడు మధ్యలో మంత్రివర్గ విస్తరణ చేయటానికి ఒక కారణం కావాలి కాబట్టి ఈ ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపి తద్వారా ఖాళీలను సిద్ధం చేసుకుని కేబినెట్ విస్తరణకు ప్లాన్ చేసుకున్నారట.ఈ లెక్కన చూస్తే పిల్లి,మోపి దేవిలకు వచ్చింది ప్రమోషన్లు కాదని మంత్రులుగా ఊస్టింగ్ లని వైసీపీలోనే కొత్త కథలు వినిపిస్తున్నాయి.లోగుట్టు జగన్ కే ఎరుక !