గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశం మన దేశం. ఇక్కడ ఏ దేశంలో లేని కుల మతాలకు, ఆచారాలు ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమే ఇక్కడా.. కానీ ఒక్క విషయంలో మాత్రం మార్పు రావడం లేదని పలువుని వాదన. అమ్మాయిలను అబ్బాయిలకు సమానంగా చూసే విధానంలో మార్పు రావడం లేదు. అమ్మాయి పుట్టింది అంటే.. తను మాకు బలం అనే వారి కంటే మాకు బరువు అనేవాళ్లే ఈ దేశంలో ఎక్కువ.
అమ్మాయిలను తక్కువగా చూడొద్దు.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయొద్దని ఎంత మంది ప్రముఖులు చెప్పినా.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కానీ మార్పు మాత్రం రావడం లేదు. ఈ విషయాన్నే ఇప్పుడు మళ్లీ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ ఒక నివేదికలో పేర్కొన్నారు.
ప్రసూతి మరణాలను తగ్గించడం, పోషకాహార స్థాయిని మెరుగుపరచడం, వారిని కాలేజీల్లో చేర్పించి పై చదువులు చదివించడం చేస్తే.. వారు, వారి కుటుంబం ఆర్థికంగా ఎడగడమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుందని సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు.
అంతేేకాదు అమ్మాయిల పెళ్లి వయసు పెరిగితే.. దేశంలో ప్రసూతి మరణాలు తగ్గుతాయని అన్నారు. అలాగే అమ్మాయిలు చదువుకునే అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. దానితో వారు వారి కాళ్లమీద వారు నిలబడటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందని తెలిపారు. ఇంతేకాకుండా అమ్మాయిల పెళ్లి వయస్సు పెరిగితే చాలా ప్రయోజనాలున్నాయని తెలిపారు. కుటుంబాన్ని సమర్ధవంతంగా నడిపే అమ్మాయిలను చూస్తే పెరిగే అమ్మాయిలు ఫ్యూచర్ లో గొప్ప ఆర్థిక స్వతంత్రాన్ని సాధించగలుగుతారని సౌమ్య ఘోష్ తెలిపారు.
మన దేశంలో సగటు అమ్మాయిల వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది. కానీ ఆడపిల్లలను ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసి పంపిస్తే రుణం తీరిపోతుందని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకే దేశంలో అమ్మాయిల పెళ్లి వయసు 18ఏళ్ళు ఉన్నా కానీ.. ఆ వయసు రాకముందే వారికి బాల్య వివాహాలు చేస్తున్నారు. చిన్న వయసులోనే అనేక బాధ్యతలను వారిమీద మోపుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న ప్రతీ ముగ్గురు పిల్లలో ఒకరు ఇండియాలో పుడుతున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. అలాగే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) గణాంకాల ప్రకారం 100 మిలియన్ల మందికిపైగా అమ్మాయిలకు 15 ఏళ్లు కూడా నిండకుండానే పెళ్లిళ్లు చేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతోంది. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం వలన నాలుగో వంతు మంది మహిళలు కూడా శ్రమశక్తిలోకి రావడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. మగవారితో పోలిస్తే మహిళలు సగటున 35 శాతం తక్కువగా సంపాదిస్తున్నారు.
ప్రస్తుతం అమ్మాయిలకు తగిన పెళ్లి వయసును నిర్ణయించే పనిలో ప్రభుత్వం పడింది. ప్రధాని మోడీ అమ్మాయిల పెళ్లి వయస్సు పెంచాలనే యోచనలో ఉన్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం కేంద్రం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మన దేశం చైనా, జపాన్, సింగపూర్ వరసలో నిలవనుంది. ప్రస్తుతం పురుషుల పెళ్లి వయసు 21 ఏళ్లు కాగా, అమ్మాయిల వయసును కూడా 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనలు వస్తున్నట్లు సమాచారం. ఇది జరిగినట్లు అయితే నాలుగు దశాబ్దాల తర్వాత దేశంలో అమ్మాయిల పెళ్లి వయస్సుకు సంబంధించి ఇదే తొలి సవరణ కానుంది. కానీ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, సవరణలు తెచ్చినా మారాల్సింది ముందు మనం అని గుర్తించాలి. మనం మారకపోతే మార్పులు రావు.