దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రమేష్ హాస్పిటల్ ఘోర ప్రమాదం ఘటన మరిన్ని మలుపులు తిరుగుతోంది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ కేసులో సెక్షన్ 160 సీఆర్పీసీ కింద పదిమందికి నోటీసులు అందజేసి ఇప్పటికే పలువురిని విచారణ చేశారు. రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి, బంధువులకు నోటీసులు జారీ చేయగా స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో తన అరెస్ట్పై స్టే ఇవ్వాలని కోరుతూ డాక్టర్ రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో పరిణామాలు మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అగ్ని ప్రమాదం తర్వాతే అసలు కథ
స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్ని ప్రమాదం ఘటన జరిగిన తరువాత డాక్టర్ రమేష్ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న డాక్టర్ రమేష్బాబు, ముత్తవరపు శ్రీనివాసబాబుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని విజయవాడ నగరపోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ రమేష్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం.. డాక్టర్ రమేష్తో పాటు.. రమేష్ హాస్పిటల్పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బందిని బాధ్యులుగా చూపించడం ఏంటి? అని ప్రశ్నించింది. ఏళ్ల తరబడి హోటల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. ఈ సెంటర్లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్వో కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.
అరెస్టు చేస్తారా…మేమే ఆర్డర్ వేసేయాలా?
డాక్టర్ రమేష్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా? లేదా తామే ఉత్తర్వులు ఇవ్వాలా? అని హైకోర్టు ప్రశ్నించింది. కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. క్వారంటైన్ సెంటర్లకు అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత, వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులదే కదా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బందిని బాధ్యులుగా చూపించడం ఏంటి? అని ప్రశ్నించింది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో అధికారులను బాధ్యులుగా ఎందుకు చేర్చకూడదో చెప్పాలంది ధర్మాసనం.. అయితే, దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది వారం రోజుల గడువు కోరారు.
డాక్టర్ రమేష్ సంచలన నిర్ణయం?
క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం డాక్టర్ రమేష్ పై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో వున్నారు. హైకోర్టు నుంచి ఊరట దక్కిన నేపథ్యంలో డాక్టర్ రమేష్ మీడియా ముందుకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. దీంతో త్వరలోనే ఆయన విలేకరుల సమావేశం నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు నాయుడు ఇంట్లోనే డాక్టర్ రమేష్?
ఇదిలాఉండగా, స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు. చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కేవలం కమ్మవారి గురించే ఆలోచిస్తారని ఆరోపించారు. అదికూడా ఆయనకు కావలసిన కమ్మ వారి గురించే ఆలోచిస్తారని… చంద్రబాబు కమ్మసంఘం అధ్యక్షుడు అవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో విదేశీ కంపెనీ వ్యక్తులు గ్యాస్ లీక్ చేశారని వెంటనే అరెస్ట్ చేయాలన్న బాబు రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. చంద్రబాబు సలహాలు వినే రమేష్ ఎంక్వయిరీకి రాకుండా పోయారన్నారు. ఎంక్వయిరీకి రాకుండా పారిపోయిన రమేష్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశ్రయం కల్పించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో రామ్ చంద్రబాబు మాటలు వినకుంటే మంచిదని..గతంలో బాబు సినిమావాళ్లని వాడుకుని వదిలేశారని కొడాలి నాని హితవు పలికారు.