ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ఇంకా వేడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ పరిపాలనా వికేంద్రకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులుపై గవర్నర్ జారీ చేసిన గెజిట్పై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేటస్ కో ను ఈనెల 17వరకు పొడగించింది.
మరోవైపు ఏపీ సర్కారు మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఏకంగా నిధులు ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసేసింది.
మూడు రాజధానుల అంశంపై అమరావతి జేఏసీతో పాటూ పలువురు పిటిషన్లు దాఖలు చేయగా విచారణ జరిపింది. తాజాగా రాజధాని తరలింపుపై స్టేటస్ కోను ఈ నెల 27 వరకు పొడిగించింది. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ముగియడంతో మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓ వైపు రాజధాని తరలింపుపై పిటిషన్లు, విచారణ పరంపర కొనసాగుతుంటే ఏపీ సర్కారు తన పని తాను చేసుకుపోతోంది. విభజన చట్టంలో భాగంగా పదిహేనో ఆర్థిక సంఘం ద్వారా ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాల్సి ఉంటుందని, ఆ ఈ నిధులను కేటాయించాలని కోరుతూ లేఖ పంపింది. అంటే సహజంగానే అవి కొత్త రాజధానికి అనుకోవాల్సి ఉంటుందేమో!
రాజధాని మాత్రమే కాకుండా ఏపీకి సంబంధించిన కీలక ప్రతిపాదనలతో కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం బారెడు లిస్ట్ పెట్టింది
వచ్చే ఐదేళ్లకు కనీసం రూ. 9లక్షల కోట్ల సాయం కావాలని ప్రభుత్వం అడిగింది.న్యాయవ్యవస్థ భవనాలకు రూ. 1849 కోట్లు, శాసన వ్యవస్థ భవనాలకు రూ. 1397 కోట్లు, పరిపాలనా వ్యవస్థ కోసం రూ. 5099 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారని సమాచారం. అంటే, పదిహేనో ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వం ఒక్క రాజధాని కోసమే కాదు.. మొత్తం ఏపీకి కావాల్సిన నిధుల వివరాలను కోరుతోందని స్పష్టమవుతోంది. నిధులు వచ్చిన ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సమాచారం. ఏపీ సర్కారు అడిగిన ప్రకారం భారీగా నిధులు కేంద్రం కేటాయించినట్లైతే….జగన్ సర్కారుకు ఆర్థిక పరమైన ఇక్కట్లు ఉండవని పలువురు పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఏపీ ప్రజలకు నిధులు ఇస్తారా? ఇవ్వకుండా ప్రజల చేతిలో ఇరకాటంలో పడతారా వేచి చూడాల్సిందే.