జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందని, ఆ సామాజిక వర్గానికి ఆయనే బ్రాడ్ అంబాజిడర్ అని, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కులస్తులకే ఎక్కువగా పదవులు, హోదాలు కట్టబెట్టారని టీడీపీ ఆరోపిస్తుంది. దీనిలో కొన్ని వాస్తవాలు లేకపోలేదు.
జగన్ చుట్టూ ఉన్న సలహాదారుల్లో, ఆయన పార్టీ కార్యవర్గం లోనూ, జిల్లాల ఇంచార్జి ల విషయంలోనూ, కొన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. అయితే తన సొంత సామాజిక వర్గం తప్పు చేస్తే జగన్ ఊరుకుంటారా లేదా అనేదే ఇక్కడ పెద్ద సమస్య. కులాభిమానంతో పదవులు కట్టబెట్టినంత వరకు ఓకే. జనం కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ తన సొంత కులస్తులు తప్పులు చేస్తే ఆ తప్పులను కూడా మన్నించేంత గుణం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా చూస్తూ సర్దుకుపోయే తత్వం జగన్మోహన్ రెడ్డి రెడ్డి లో ఉందా లేదా అనేదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. దానికి ఈ ఉదాహరణే సాక్షంగా నిలుస్తుంది. సమాధానంగా నిలుస్తోంది. అదేంటో చుద్దాం..
విజయవాడలో సిఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన ఒ పోలీస్ అధికారి తప్పు చేశాడు. ఉన్నతాధికారుల ప్రాధమిక విచారణలో ఆ అధికారి తప్పు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని చూపుతూ అధికార పక్ష వైసీపీ నేతలు… జగన్ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, కులం, మతం చూడరు. వేటు వేయడం ఖాయమని చెప్తూ ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు.
విజయవాడలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ నాగరాజ రెడ్డి ఒ బిల్డర్ నుండి డబ్బులు డిమాండ్ చేశారు. పడమట లోని ఒక భవన నిర్మాణం జరుగుతుండగా ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. దానిపై గొడవ జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. అయితే ఈ వ్యవహారంలో బిల్డర్ సుధాకర శర్మ నుండి ఏసీపీ నాగరాజ రెడ్డి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బిల్డర్ సుధాకర శర్మ స్వయంగా ఉన్నతాధికారులకు ఏసీపీ నాగరాజ రెడ్డిపై పిర్యాదు చేశారు. తనను డబ్బులు డిమాండ్ చేశారని పిర్యాదులో పేర్కొన్నారు.
పోలీస్ అధికారిపై అవినీతి ఆరోపణలు రావడంపై డీజేపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ గా తీసుకున్నారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణలో అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీనితో ఏసీపీ నాగరాజ రెడ్డి ని విధుల నుండి సస్పెండ్ చేస్తూ డీజేపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.