సంగారెడ్డి: కౌన్సిలర్ టిక్కెట్ల విషయంలో తాను జోక్యం చేసుకోనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక పార్టీ ఎన్నికల ఇన్చార్జి, వార్డు నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికలో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు కలసి అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. తన భార్యకు కూడా టికెట్ ఇవ్వాలా ? వద్దా? అన్నది మీరే నిర్ణయించాలని వారితో చెప్పారు. అయితే పోటీలో దిగే అభ్యర్థులంతా గెలిచి రావాలని, గెలవకపోతే తనకు గౌరవం ఉండదని వ్యాఖ్యానించారు. టికెట్ ఆశించి దక్కనివారికి కోఆప్షన్ మెంబర్గా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఎన్నికల ఖర్చు కోసం తన నుంచి ఏమీ ఆశించవద్దని జగ్గారెడ్డి అన్నారు. తన దగ్గర డబ్బులు లేవని… ఎవరికీ తాను డబ్బు ఇవ్వలేనని… డబ్బుల టెన్షన్ తనకు పెట్టొద్దని కోరారు. టీఆర్ఎస్ వారికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. సంగారెడ్డి మున్సిపాలిటీ రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
previous post
next post