ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారో లేదో తెలియదు కానీ.. ఆయన మీద మాత్రం పలువురు అడుగడుగున విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యర్థి జో బైడెన్ గట్టి పోటీ ఇవ్వబోతున్నారని పలు సర్వేలు చెబుతునే ఉన్నాయి. అలాగే చైనాలోని బ్యాంకులో ట్రంప్ కు అకౌంట్ ఉండటం, విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారి నుంచి విమర్శలు రావడం.. వంటి విషయాలతో ట్రంప్ కు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వీటన్నిటి మీద కారం చల్లే వార్త మళ్లీ ఇంకోటి వచ్చి పడింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ఓటు వేయొద్దని ఓ వృద్ధురాలు తన సంస్కరణ సభకు వచ్చిన వారిని కోరింది. అదేంది చనిపోయిన తర్వాత కోరడం ఏంటని అనుకుంటున్నారా..? మరేంలేదు.. ఆ వృద్ధురాలు చనిపోయే ముందు ఒక లేఖలో ఈ విషయాన్ని రాసింది. మిన్నెపోలిస్ ఇన్వర్ గ్రోవ్ హైట్స్కు చెందిన జార్జియా మే అడ్కిన్స్(93) సెప్టెంబర్ 28న గుండెపోటుతో మరణించింది. కాగా సెయింట్ పాల్ పయనీర్ ప్రెస్లో ప్రచురించబడిన దాని ప్రకారం తన దహన సంస్కారాలు ఎలా జరపాలో ఆమె ముందే తెలిపింది అనమాట.
కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ అక్టోబర్ 16 చర్చ్ సేవతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆ లేఖలో కోరింది. అలాగే తన సమాధిపై పూలకు బదులుగా ట్రంప్కు ఓటు వేయొద్దని స్నేహితులను, కుటుంబ సభ్యులను కోరుకుంది.
దాంతో ఈ బామ్మ కోరిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్టును నిమిషాల వ్యవధిలోనే లక్షల మంది చూసి షేర్ చేశారు. దీన్ని పలువురు ప్రసంశించగా.. మరికొందరు ఖండించారు. అయితే వృద్ధురాలు జార్జియాకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు, ఇద్దరు సవితి కుతుళ్లు, 17 మంది మనమలు, మనవరాళ్లు, 24 మంది ముని మునమలు, మనవరాళ్లు, ఒక ముని ముని మనవడు ఉన్నాడని పలు న్యూస్ ఛానెల్స్ తెలిపాయి. ఈ వార్త ట్రంప్ కు చెడు చేస్తుందో లేదో కానీ.. ఇలాంటి వార్తలతో మాత్రం ట్రంప్ రోజూ ట్రెండింగ్ ఉంటున్నాడు.