Jamili Elections : కొన్నాళ్లుగా దేశంలో హాట్ టాపిక్ గా నిలుస్తున్న అంశాల్లో ఇదొకటి. 2019 సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏడాదికే ‘జమిలి ఎన్నికలు’ ప్రస్తావన వచ్చేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఒకేసారి ఎన్నికలు జరిగేలా చట్టాలు తీసుకురావాలనేది ఒక ఆలోచన. దేశంలో ప్రతి ఏటా.. ఏదొక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే.. ఖర్చు అలానే ఉంటోంది. పైగా.. కేంద్రం ఆయా రాష్ట్రాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తోంది.
ఇలా కాకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే మేలని.. ప్రభుత్వాల దృష్టి కొత్తగా అటువైపు మళ్లించే పని ఉండదని జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. 2022 లోనే ఈ ఎన్నికలు జరిగొచ్చని వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు జమిలీ ఎన్నికల అంశం వెనక్కు వెళ్లిపోయిందా? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
Jamili Elections : ఐదు రాష్ట్రాల ఎన్నికలే సంకేతమా..?
కేంద్ర ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇదే జమిలి ఎన్నికల అంశాన్ని తేల్చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఏడాదికే ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై రాజ్యాంగ సవరణ, చట్టం చేయడం, ఎన్నికల నిర్వహణ వంటి విషయాలపై ఇప్పటికే లా కమిషన్ పరిశీలిస్తోంది. దీనిపై ఇంకా ఆమోదం రాలేదు. లా కమిషన్ ఆమోదం తెలిపినా లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితేనే చట్ట రూపంలోకి వస్తుంది. అప్పుడే జమిలి ఎన్నికలు సాధ్యం. ఒకే దేశం – ఒకే ఎన్నికతో దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలని బీజేపీ చేసిన ఆలోచనల్లోనుంచి వచ్చిందే జమిలి ఎన్నికలు. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేయడమే ఇందుకు కారణమంటున్నారు.
బీజేపీపై వ్యతిరేకత..
ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యూలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు ఈ ధరలు మింగుడుపడనివి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై పెట్రోలియం సంస్థలే ఆలోచన చేయాలని చెప్పడం కేంద్రం చేతులెత్తేసిందనేందుకు నిదర్శనంగా చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె కేంద్రమే స్పందించాలని అనే వ్యాఖ్యలకు ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మరోవైపు మూడు నెలలుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం దేశం మొత్తం విస్తరించలేదు కానీ.. ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. కేంద్రం మొండివైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే చెప్పాలి. మరోవైపు.. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తాం.. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని సాక్షాత్తూ ప్రధానే చెప్పడం సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇలా కేంద్రం తీరు, నిర్ణయాలు సామాన్యులపైనే ప్రభావం చూపిస్తున్న తరుణంలో జమిలికి వెళ్తే బీజేపీకి పట్టం కట్టడం కష్టమే అనే అభిప్రాయాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబు ఆశలు గల్లంతేనా..?
జమిలి జరుగుతాయనే వార్తలు వచ్చినంతగా.. జరిగే అవకాశాలు లేవు.. అని వార్తలు ఎక్కువగా రాలేదు. కానీ.. సీఈసీ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుపుతున్న వేళ మళ్లీ ఏడాదికే జమిలికి వెళ్లే అవకాశాలపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి.. జమిలిపై కేంద్రం ఆలోచన మాత్రమే చేస్తుంటే.. టీడీపీ వంటి అధికారం కోల్పోయిన పార్టీలు జమిలిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇటివలి పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలు మరో ఏడాదిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.. నేతలు సిద్ధంగా ఉండాలని ప్రకటించేశారు. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న సందర్భంలోనూ ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో కొన్ని పార్టీలు ఈ ఉద్దేశాలు కలిగిస్తున్నాయి. అయితే.. జమిలిపై తుది నిర్ణయం తీసుకునే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇప్పుడు వెనకడుగు వేసే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత ఉన్న ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే మొదటికే మోసం రావొచ్చనే అనుమానాలే ఇందుకు కారణం. ఇదే నిజమైతే జమిలిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు షాక్ తగిలినట్టే. మరి.. కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.