రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం గడచిన పది నెలలుగా హాట్ టాపిక్ గానే ఉంది. ఓవైపు టీడీపీ అమరావతి.. మరోవైపు వైసీపీ మూడు రాజధానులు అంటూ ఎవరికి తోచిన అభిప్రాయాలు చెప్తున్నారు. దీనిపై ఇటివలే ఓ జాతీయ మీడియా పోల్ నిర్వహించింది. మూడు రాజధానులు ఉండాలా వద్దా.. సీఎం జగన్ నిర్ణయం సరైనదేనా..? అంటూ ఆ పోల్ సాగింది. మొత్తంగా 4,31,980 ఓట్లు పోలయ్యాయి. ఈ పోల్ లో దాదాపు 81 శాతం మంది ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 18 శాతం మాత్రమే జగన్ నిర్ణయాన్ని స్వాగతించినట్టు ఓట్లు పోల్ అయ్యాయి. నిజానికి.. మూడు రాజధానుల నిర్ణయంపై అంత వ్యతిరేకత ఉందా..? ఈ పోల్ లో వాస్తవమెంత..? అనే విషయాల్ని కాస్త లోతుగా తెలుసుకోవాల్సిందే.
అమరావతి మేనేజింగ్ కెపాసిటీ తెలియనిదా..!
ఆమధ్య మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో ఓ బెంచ్ కు వెళ్లింది. అయితే.. ఆ న్యాయమూర్తి ఈ కేసును వాదించేది తన కుమార్తె కావడంతో ఆయన ఈ కేసును సమీక్షించలేనంటూ మరో బెంచ్ కు బదిలీ చేశారు. అక్కడ నుంచి కూడా కొన్ని కారణాలతో మరో బెంచ్ కు వెళ్లింది. దీంతో వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో ఈ ప్రాంతవాసులు సిద్ధహస్తులనే విషయం స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. అమరావతి ప్రాంత రైతులు, వారి ముసుగులో ఉన్న నాయకులు కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసే విషయంలో కానీ.. తమ ప్రభావం చూపడంలో కానీ ఆరితేరి ఉన్నారు. అయితే.. దీనిపై పూర్తిగా ఓ నిర్ణయానికి వచ్చే పరిస్థితులు లేవు.
జగన్ కు ఈ విషయాలన్నీ తెలుసా..?
మూడు రాజధానుల అంశంపై ఎంత అనుకూలత ఉందో.. అంతే వ్యతిరేకత ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనుకూలంగా ఉంటే.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత వస్తోంది. కర్నూలులో న్యాయ రాజధాని ప్రకటనతో రాయలసీమ జిల్లాల్లో పెద్దగా ఈ విషయంపై స్పందన లేదనే చెప్పాలి. దీంతో రాజధాని అంశంపై 50-50 అభిప్రాయం నెలకొందని చెప్పాలి. ఈ విషయం సీఎం జగన్ కు తెలియంది కాదు. కానీ.. ఓ నేషనల్ మీడియా మాత్రం ఏకంగా 81 శాతం జగన్ కు వ్యతిరేకంగా పోల్ ఇవ్వడం వీరందరి మేనేజ్ మెంట్ లెవల్స్ కు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పాలి. దీనినే ఏపీలో టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసుకుంటోంది.