(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం కల్గించిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి కీలకమైన కోణాలు దృష్టికి వచ్చాయి. డాక్టర్ సుధాకర్ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంలో సుధాకర్ కేసులో కుట్ర కోణం దాగి ఉందని, లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పేర్కొన్నది.
దర్యాప్తునకు ఇంకా సమయం కావాలి
విశాఖ జిల్లా నర్శీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడుగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ మాస్క్లు, పిపిఈ కిట్లు సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ బహిరంగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, దాంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆ తదుపరి విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ రోడ్డుపై వీరంగం వేయడం, పోలీసులు ఆయనను అమానవీయంగా అదుపులోకి తీసుకొని మెంటల్ ఆసుపత్రికి తరలించడం, ఆ తరువాత ఆయన తల్లి హైకోర్టును ఆశ్రయించి తన కుమారుడికి మానసిక రుగ్మత లేకపోయినా ఆసుపత్రిలో ఇబ్బంది పెడుతున్నారంటూ వేడుకోగా కోర్టు అనుమతితో ఆయనను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ కేసును హైకోర్టు..సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడంతో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.
నవంబర్ 11న నివేదిక అందజేయాలి
ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉన్నందున లోతుగా దర్యప్తు చేయడానికి మరి కొంత సమయం కావాలని న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు…ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలను మొత్తం నివేదించాలనీ, నవంబర్ 11న పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని సిబిఐకి ఆదేశిస్తూ విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఒ దళిత డాక్టర్ పై కక్షతో ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందంటూ ప్రతిపక్షాలు, దళిత సంఘాలు ఆందోళన చేయడం, ఇది రాష్ట వ్యాప్తంగా సంచలన అంశంగా మారిన సంగతి తెలిసిందే. సిబిఐ దర్యాప్తులో కుట్ర కోణాలు ఏమి వెలుగులోకి వస్తాయో? ఎవరు బాధ్యులు అవుతారో? చూడాలి మరి.