ఢిల్లీ, జనవరి 9: కేంద్రం బుధవారం రాజ్యసభలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. అగ్రవర్ణాలు, అన్ని మతాల్లోని పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా 124వ రాజ్యంగ సవరణ బిల్లును రూపొందించింది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర మంత్రి ధావర్ చంద్ గెహ్లాట్ ప్రవేశపెట్టారు.
విదేశాల నుంచి వచ్చిన హిందూ మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన మరో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ విపక్ష సభ్యులు గొడవ చేస్తుండగానే మంత్రి ఇబిసి కోటా బిల్లును ప్రవేశపెట్టారు. గందరగోళం మధ్యనే డిప్యూటి చైర్మన్ సభను కొనసాగించారు. ఈ బిల్లు ఎన్నికల తమాషా అని ఒక పక్క అంటూనే కాంగ్రెస్ సభ్యులు దీన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంటున్నారు. డీఎంకె ఎంపి కనిమొళి బిల్లులో సవరణలను కోరారు.
బిల్లుపై చర్చ మొదలు పెట్టేముందు సెలెక్ట్ కమిటీకి పంపాలని సిపిఐ, డిఎంకె సభ్యులు డిమాండ్ చేశారు. రాజ్యసభను ఒక రోజు పొడిగించడంపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు పోడియం ముందుకు వచ్చి ఆందోళన చేశారు. బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి గెహ్లాట్, ‘అగ్రకులాల్లోని పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చదువుకోవడానికి బ్యాంకు రుణాలు కూడా తీసుకుంటున్నారు. పేద గొప్ప అన్న తారతమ్యం లేకుండా సామాజిక న్యాయం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించారు. విపక్ష సభ్యల ఆందోళనతో మధ్యాహ్నం 2గంటలకు సభ వాయిదా పడింది.