గత సార్వత్రిక ఎన్నికలలో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను హాకింగ్ చేశారని సోమవారం లండన్లో ప్రకటించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా కోరింది.
2014 ఎన్నికలలో బిజెపికి అనుకూలంగా ఇవిఎంల హాకింగ్ జరిగిందని షుజా ఆరోపించారు. తాను ఆ సమయంలో ఇవిఎంలు ఉత్పత్తి చేసే ఇసిఐఎల్ సంస్థతో కలిసి పని చేస్తున్నట్లు ఆయన చెప్పుకున్నారు. షుజా ఇంకా అనేక సంచలనాత్మక విషయాలు బయటపెట్టారు. హకింగ్ విషయం బయటకు వస్తుందనే కేంద్ర మంత్రి గోపీనాధ్ ముండేని కారు ప్రమాదంలో హతమార్చారని షుజా ఆరోపించారు.
కన్నడ జర్నలిస్టు, సమాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్య కూడా దీనితో ముడవడిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా గోష్టి సందర్భంగా అక్కడ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ కూడా కనబడ్డారు. దాన్ని ఆసరాగా తీసుకుని బిజెపి కాంగ్రెస్పై తీవ్ర విమర్శలకు దిగింది. 2019 ఎన్నికలలో ఎటూ ఓడిపోతామని ముందే తెలిసు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడే ఓటమికి సాకులు వెదుకుతోందని న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.