రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణకు చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు, అనుకూల మీడియా వ్యతిరేకం అనే విషయం తెలసిందే. చంద్రబాబు మీడియా ముఖంగా గగ్గోలు పెడుతుంటే పార్టీ నాయకులు ముఖ్యంగా ఆయన సామాజికవర్గం నాయకులు ఆందోళనలకు దిగుతున్నారు. ఇందుకు బాబు అనుకూల మీడియా బాకా ఊదుతూ రకరకాల కథనాలు ఇస్తోంది. వాస్తవాలకు దూరంగా వీటిని ప్రచురిస్తున్నారు.. ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేటి ‘ఈనాడు’లో మధ్యతరగతిపై పిడుగు అనే కథనాన్ని ప్రచురించారు. అమరావతిలో సామాన్యులు, ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు స్థలాలు కొన్నారనీ.. ధరలు పడిపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారనీ రాశారు. ఈ కథనం విషయానికి వస్తే..
కొన్నవారిలో ఎక్కువ ప్రభుత్వోద్యోగులే.. కానీ..
నిజానికి రాజధాని తరలింపులో ప్రభుత్వోద్యోగులో ఓ వర్గం వ్యతిరేకం. మరో వర్గం వారు అనుకూలం. వ్యతిరేకించేవారు ఎక్కువగా అమరావతిలో భూములు కొన్నవారే. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులంతా అక్కడ సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో భూములు, ఫ్లాట్ల రూపంలో పెట్టుబడులు పెట్టారు. రాజధాని తరలింపు ఆలోచన రావడంతో కొందరు ఆ పెట్టుబడులపై ఆశలు పోగొట్టుకుని అమ్మాలనుకున్నారు.. కొందరు వేచి చూస్తున్నారు. ఈనాడు రాసినదాంట్లో ఎక్కువ దెబ్బతింది వాళ్లే. అయితే.. ఇక్కడ మరో కోణం ఏంటంటే..
కొనుగోళ్లలోనూ రహస్యాలున్నాయి..
అమరావతిలో రహస్య తతంగాలు ఎక్కువే ఉన్నాయి. అసలు పేర్లు బయటకు రాకుండా బినామీ పేర్లతోనూ.. నల్లడబ్బుతోనూ స్థలాలు ఎక్కువగా కొన్నారు. వీరంతా టీడీపీ, ఆ సామాజికవర్గంలోని వారికి చెందిన బంధువులే ఎక్కువ. బ్యాంకు లోన్లతో లెక్కల్లో చూపిన డబ్బుతో స్థలాలు కొన్నవి తక్కువే. 2015-16లో జరిగిన లావాదేవీలన్నీ నల్లడబ్బుతో జరిగినవేనని ఓ నివేదిక పేర్కొంది. అందుకే వీరిలో కొందరు ప్రభుత్వోద్యోగులు తమ వ్యవహారాలు బైటకొస్తాయని భావించే ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఈనాడు కథనంలో పేర్కొంటే తన విశ్వసనీయతకు ప్రతిరూపంగా ఉండేది. ఈనాడులోని దాదాపు 50 మంది ఉన్నతోద్యోగులకు కూడా ఫ్లాట్లు ఇస్తామని ప్రకటించడంతో వారు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే వీరి ఆవేదన అని తెలుస్తోంది.