కరోనా ఆపత్కాలంలో ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ అంటూ 20 లక్షల కోట్ల అతిపెద్ద ప్యాకేజీలు ప్రకటించి మోడీ ప్రభుత్వం అభాసుపాలైంది. ఆ 20 లక్షల కోట్లలో కావాల్సిన వారికి, అవసరం ఉన్నవారికి, అతి పేదలకు ఎంత వరకు ఉందింది అనేది ఇప్పుడే కాదు ఎన్ని ఏళ్లు గడిచినా మోడీ ప్రభుత్వం గానీ మంత్రులు గానీ సమాధానం చెప్పలేరు.
కేవలం వలస కార్మికులకు నాలుగు నెలల రేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక మిగిలినదంతా కార్పొరేట్ శక్తులకు రుణాల రూపంలో ఇచ్చి దాన్ని ప్యాకేజీగా చెప్పుకున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే తాజాగా నిన్న వ్యవసాయ నిధి అంటూ లక్ష కోట్లకు పైగా ఒ ప్యాకేజీని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించారు. ఇది కూడా పాత సీసాలో కొత్త సారా అన్నట్లు ఇది వరకు ఇప్పటి వరకు వ్యవస్థీకృతంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాల ద్వారానే రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు. దీనిలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఒ కొత్త ప్రాజెక్టును రూపొందించి కొత్తగా రైతులకు చేరవేసేలా చూసుకోకుండా ఇప్పటికే వ్యవస్థీకృతమైన కొన్ని పాత పద్ధతుల ద్వారా రైతులకు రుణాలు అంటే ఇవి ఆశించిన ఫలితాలు అయితే కచ్చితంగా ఉండదని చెప్పవచ్చు.
20లక్షల కోట్ల ప్యాకేజీ గురించి ఒక్క సారి చెప్పుకుందాం
20 లక్షల కోట్ల ప్యాకేజీని మోడీ ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రకటించుకొని దాని ద్వారా ప్రభుత్వానికి మోడీకి ఎంతో బూస్టింగ్ వస్తుంది, గొప్ప పేరు వస్తుంది అని అనుకున్నారు. కానీ అది కాస్తా తుస్ మనడంతో మోడీ ఇప్పుడు మరో కొత్త ప్యాకేజీకి తెరలేపినట్లు ఉంది. నిజానికి ఆత్మ నిర్భర ప్యాకేజీలో అవసరమైన వారికి, అత్యంత పేదలకు అందింది కేవలం 5 శాతం మాత్రమే. అంటే లక్ష కోట్లు మాత్రమే. మిగిలి 19 లక్షల కోట్లు కూడా కార్పొరేట్ శక్తులకు, కొన్ని బ్యాంకులకు పరిశ్రమలకు మాత్రమే అందించే ప్రయత్నం చేశారు. పరిశ్రమల్లో కూడా అవసరంలో, ఆపదలో ఉన్న చిన్న పరిశ్రమలకు కాకుండా టర్నోవర్ బాగున్న పెద్ద పరిశ్రమలకు, బ్యాంకుల్లో రాయితీ రుణాలకు, ఇల్లు కట్టుకోవడానికి అదనపు రుణాలకు మాత్రమే ఎక్కువగా మంజూరు చేశారు. నిజానికి ఆత్మ నిర్భర ప్యాకేజీ ప్రకటించే సమయంలో దేశంలో దాదాపు 20 కోట్ల మంది కరోనా కారణంగా పేదరికంలోకి నెట్టి వేయబడ్డారు.
ఆ 20 కోట్ల మందిని ఆదుకునేందుకు కొత్త ప్యాకేజీలో కొత్త అంశాలు ప్రకటించలేదు. అలాగే వలస కార్మికుల కోసం కూడా కేవలం మూడు నెలలు ప్రకటించారు తప్ప అదనపు ప్రయోజనం కల్పించలేదు. ఇప్పటికే ఆ ప్యాకేజీలో 5శాతం మించి అదనపు ప్రయోజనం పేదలకు ఏమీ అందలేదు. అందుకే ఆ ప్యాకేజీ ఆశించిన ప్రయోజనం కనిపించలేదు కాబట్టి ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కావచ్చు, ప్రధాని మోడీ కావచ్చు, ఆ బిజెపి పెద్దలు కావచ్చు 20 లక్షల కోట్ల మీద ఎక్కడ ఎవరు ఏమి ప్రస్తావించలేదు. మళ్ళీ మాట్లాడలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజెపి నాయకులు ఎవరూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ మళ్ళీ మరో మాట మాట్లాడలేదు. అది అంతగా విఫలం అయ్యింది.
ఈ లక్ష కోట్ల ప్యాకేజీలో ఏముంది అంటే..
ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్ ) ద్వారా రైతులకు నిధులు మంజూరు చేస్తారు. కాగా పీఎం-కిసాన్ పథకం కింద 8.5 కోట్ల మంది రైతుల కోసం రూ.17వేల కోట్లను మోదీ విడుదల చేశారు. ఆరో విడత కింద విడుదల చేసిన ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేదిగా పీఎం-కిసాన్ పథకం విజయవంతమైందని మోదీ పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చేది ఉండదు.
వాళ్లు పదేళ్ల కిందటో,15ఏళ్ల క్రిందటో తీసుకున్న రుణాలనే ఏటా రెన్యూవల్ చేసుకుంటూ, దానికి వడ్డీలు కట్టుకుంటూ అదే ఇచ్చినట్లు ఉంటుంది తప్ప కొత్తగా రైతులకు పీఏసీఎస్ లలో రుణాలు ఇవ్వడం లేదు. ఇది గడచిన పదేళ్లుగా జరుగుతున్న తంతే. అందుకే ఇప్పుడు మరో లక్ష కోట్లు అదనంగా ప్రకటించిన సరే ఏ ఒక్క అదనపు రైతుకు ప్రయోజనం చేకూరదు.
అందుకే ఈ ప్యాకేజీ పాత సీసాలో కొత్త సారీ అనే తరహా లోనే ఉంది తప్ప అదనపు ప్రయోజనం కనిపించేదిగా లేదు అని విమర్శలు మొదలయ్యాయి.