Nimmagadda.. ఏకంగా గవర్నర్ ని టార్గెట్ చేసారా..? గవర్నర్ తో కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు యుద్ధం తప్పేలా లేదా..! అంటే ప్రస్తుతం పవనాలు ఆ దిశగానే వీస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ఆసక్తిగా కాదు.. సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉండే హై టెన్షన్ వాతావరణం పంచాయతీ ఎన్నికల సమయంలో నెలకొంది. ఏపీలో ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాలన్నింటిలో ప్రస్తుతం రేసుగుర్రంలా దూసుకుపోతోంది మాత్రం ఖచ్చితంగా నిమ్మగడ్డ మాత్రమే. ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కు తగ్గి ఎన్నికలకు సహకరిస్తుంది. ఇందుకు నిమ్మగడ్డ కోర్టుల్లో నెగ్గారు. దీనికంటే ముందు ఆయన రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆయన నుంచి ఆశించిన స్పందన నిమ్మగడ్డకు కరువైంది. సీఎం జగన్ పై పోరాటం చేసిన నిమ్మగడ్డ ఇప్పుడు గవర్నర్ పై కూడా చేస్తారా..?
గవర్నర్ స్పందన అంతంతమాత్రమే..!
రాజ్యంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్రంలో ఏవైనా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అగాధం వస్తే సయోధ్య కుదర్చాల్సిన కీలకమైన పదవిలో ఉన్న గవర్నర్ దే. శాసన వ్యవస్థగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు.. ఎన్నికల వ్యవస్థకు ఏపీ ప్రభుత్వానికి (శాసన వ్యవస్థ) మధ్య గ్యాప్ వచ్చినప్పుడు గవర్నర్ సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి. కానీ.. మన రాష్ట్రంలో ఈ పరిస్థితులు కానరాకపోవడంతో ఈ గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. అందుకే ఏపీ పంచాయతీ ఎన్నికలు సీఎం జగన్ వర్సెస్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ మధ్య ఆధిపత్య పోరులా మారింది. ఈ పరిణామాలన్నీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు వెళ్లాయి. ప్రతి అంశాన్నీ గవర్నర్ కార్యాలయం పరిశీలిస్తుంది.. నివేదికలు కూడా తెప్పించుకుంటుంది. పరిస్థితులు అదుపు తప్పితే కేంద్రానికి నివేదిక ఇస్తుంది కూడా. పంచాయతీ ఎన్నికల విషయాలన్నింటినీ జగన్ తోపాటు నిమ్మగడ్డ గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు. నిమ్మగడ్డ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ప్రవీణ్ ప్రకాశ్ ను విధుల నుంచి తప్పించడం, ఇద్దరు కలెక్టర్లు, ఐఏఎస్ లను విధుల నుంచి తప్పించడం, మంత్రులు బొత్స్, పెద్దిరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వ్యాఖ్యలు వంటి అంశాలన్నింటినీ.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా తీసుకెళ్లారు. మీరు స్పందించి ఆదేశాలివ్వకపోతే తాను కోర్టుకు వెళ్లడం తప్ప గత్యంతరం లేదని కూడా గవర్నర్ కే లేఖ రాశారు. అయినా.. గవర్నర్ నుంచి స్పందన లేదనేది నిజం.
Nimmagadda : నిమ్మగడ్డ అటాక్ చేస్తే..
దీంతో ఆయన గవర్నర్ పై కూడా కేంద్రానికి లేఖ రాసే ఉద్దేశంలో ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతిస్తూ రాజ్యాంగ వ్యవస్థను పట్టించుకోవడం లేదని. ఏపీకి గవర్నర్ మార్పు అవసరం ఉందంటూ ఆయన ఇప్పటికే కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీనిపై కేంద్రం స్పందించి లేఖ రూపంలో ఎస్ఈసీ తన వాదన ఇవ్వాలని సూచించింది. దీనిపై కేంద్రం వివరణలు, సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. మరో మూడు వారాల్లో ముగిసే పంచాయతీ ఎన్నికల కోసం నిమ్మగడ్డ ఇంతగా రియాక్ట్ అవుతారా..? ఏకంగా గవర్నర్ పై ఎస్ఈసీ ఫిర్యాదు చేసే వరకూ వెళ్తారా..? కేంద్రం అన్ని పరిస్థితులను గమనిస్తూనే ఉంటుంది కదా..? ఏమైనా పరిస్థితులు అదుపుతప్పితే గవర్నర్ నుంచే వివరాలు తీసుకుంటుంది కదా..? అనే ప్రశ్నలూ లేకపోలేదు. అయితే..
గవర్నర్ స్పందన లేకపోవడానికి కారణం అదేనా..?
మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడం.. అమరావతి రైతుల ధర్నాలను పట్టించుకోకపోవడం.. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకపోవడం.. విపక్షాలకు ఎక్కువగా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం.. వారు నివేదించిన సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకోకపోవడం.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకెళ్లిన వాదనలను పట్టించుకోకవడం.. వంటి ఆరోపణలు గవర్నర్ చుట్టూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ఆయన మార్పు జరగుతుందని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఆయన బదిలీ తథ్యమని.. మహారాష్ట్ర వ్యక్తికి గవర్నర్ గా రానున్నారని.. పూర్తిస్థాయి గవర్నర్ వచ్చే వరకూ తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు ఇస్తారని కూడా వార్తలు రౌండ్ అవుతున్నాయి. పై వార్తలన్నింటిలో నిజానిజాలు ఎలా ఉన్నా.. దేశంలో గవర్నర్లే కాదు.. ఏ వ్యవస్థ అయినా బీజేపీ చేతుల్లోనే ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది బీజేపీపై పడుతుంది కాబట్టి గవర్నర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి.