బయటి పోరు కంటే ఇంటి పోరు తట్టుకోవడం కష్టం. కాంగ్రెస్ పార్టీ నడిచే తీరే ఇందుకు నిదర్శనం. మహాసముద్రం లాంటి ఆ పార్టీలో కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకూ ఎవరికి వారే బాస్. కాంగ్రెస్ వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కి పైకెళ్దామని ప్రయత్నిస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ప్రతిసారీ పాములు కాటేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత ఖాళీ అయిన టపీసీసీ అధ్యక్షుడి పదవిని భర్తీ చేసే పనిలో అధిష్టానం ఉంది. ఈ రేసులో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ రేసులో రేవంత్ కూడా ఉన్నారు. కానీ.. ఆయన్ను ఆ ఉట్టి కొట్టనివ్వడం లేదు.
రేవంతే టార్గెట్ ఎందుకు..?
టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డిపై కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ప్రధానంగా ఓటుకు నోటు కేసు ఉంది. 2018 ఎన్నికలకు ముందు రేవంత్పై ఆదాయపు పన్ను శాఖ దాడులు, అనంతరం బంధువులపై గోపన్ పల్లిలో భూ కబ్జా ఆరోపణలతో కేసు నమోదు, రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ కోటిపైగా క్యాష్ తో పట్టుబడిన సమయంలో రేవంత్ లెటర్ హెడ్ అక్కడ ఉండటం.. ఇలా ఆయనపై కేసులు ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే.. రేవంత్ ఎదిగే అవకాశం వచ్చిన ప్రతిసారీ వీటిని బయటకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడి రేసులో రేవంత్ పేరు కూడా ఉంది. మాసివ్ లీడర్ క్వాలిటీస్, లీడర్ షిప్, మాస్ ఫాలోయింగ్ ఉన్నా కొందరు ఆయనపై ఉన్న కేసులపైనే దృష్టి పెట్టి అధిష్టానం వద్ద వెనక్కు లాగుతున్నారు.
రేవంత్ రెడ్డి అవసరమే ఉంది.. కానీ..
తెలంగాణలో డీలా పడ్డ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి తరుపు ముక్క. వాగ్దాటిలో, విమర్శలు చేయడంలో, వాటిని తిప్పి కొట్టడంలో రేవంత్ ఘనాపాటి. కేసీఆర్, కేటీఆర్ కు ధీటుగా ఎదగాల్సిన వ్యక్తి. కాంగ్రెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లగల కెపాసిటీ ఉన్న వ్యక్తే. అయితే.. మొదటినుంచీ కాంగ్రెస్ వీరవిధేయులుగా పని చేస్తున్న మహామహులు.. మధ్యలో వచ్చిన రేవంత్ కు ఉన్నత పీఠం ఇస్తుంటే ఊరుకుంటారా..! ప్రస్తుత తరుణంలో రేవంత్ వంటి స్పీడ్ గన్ అవసరమే అయినా.. పార్టీ అనేక కోణాల్లో ఆలోచిస్తోంది. టీడీపీ కదలలేని స్థితిలో ఉందనుకుని వస్తే.. కాంగ్రెస్ పడుతూ లేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి రేవంత్ పార్టీ నిర్ణయాన్ని పాటిస్తారా.. లేక గతంలో వార్తలు వచ్చినట్టు సొంత పార్టీ పెడతారా అనేది చూడాలి.