ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా కిషోర్ రెడ్డి టిడిపిని వీడి బిజెపి గూటికి చేరాడు. దీంతో భూమా కుటుంబంలో చీలిక వచ్చినట్లు అయ్యింది.
మాజీ ఎంపిపి అయిన కిషోర్ రెడ్డి శుక్రవారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. కిశోర్ రెడ్డితో పాటు పలువురు యువకులు బిజెపిలో చేరగా నడ్డా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని కాపాడుకునేందుకే బిజెపిలో చేరామని ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలో బిజెపి బలోపేతానిక తన వంతు కృషి చేస్తానని కిషోర్ రెడ్డి తెలిపారు.
దివంగత నేత భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా భాస్కరరెడ్డి కుమారుడు కిషోర్ రెడ్డి. భూమా కుటుంబానికి చెందిన నాయకుడు బిజెపిలో చేరడం ఆళ్లగడ్డ నియోజకవర్గ టిడిపికి గట్టి షాక్యేనని పలువురు పేర్కొంటున్నారు.