అమరావతి: వెలగపూడిలో రాజధాని రైతులు రిలే దీక్షలకు బిజెపి నేత, మాజీ మంత్రి రావెల కిషోర్బాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.
సిఎం జగన్ మొండి మనిషే కానీ అమిత్ షా పేరు చెబితే గుండెల్లో గుబులు పట్టుకుంటుందని రావెల వ్యాఖ్యానించారు. రాజధాని రైతులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ వైఖరితో ఏపీ రాజధాని పేరేంటో చెప్పలేని దుస్థితికి వచ్చిందన్నారు.
రాజధానిని మూడు ముక్కలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ కారణంగానే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వెనుకాడుతున్నారన్నారు. పార్టీలపై కక్ష ఉంటే రాజకీయ పోరాటం చేయాలే కానీ ప్రజలపై కక్ష సాధించడం మంచిది కాదని రావెల అన్నారు. రాజధానిని తరలించేందుకు అక్రమాలు జరిగాయని బూచిగా చూపుతున్నారని ఆయన విమర్శించారు.
మైత్రి సంస్థ పేరుతో తాను భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మైత్రి సంస్థతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ తనపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేయగలరా అని రావెల ప్రశ్నించారు.