జి.వి.హర్షకుమార్ ఈ పేరు చెబితే దళిత ఉద్యమాలు గుర్తుకొస్తాయి. దళిత వర్గాలకు బాసటగా హర్షకుమార్ ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ టైం లో యూత్ లీడర్ గా రాజకీయాల్లోకి వచ్చిన హర్షకుమార్ సీనియర్ నేత వీహెచ్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాజకీయాల్లో ఎంతో దూకుడుగా ఉండే హర్షకుమార్ నైజం చాలాసార్లు వివాదాస్పదంగా మారింది. కాగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన “సమైక్యాంధ్ర పార్టీ” తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో చాలా వరకు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఆ తర్వాత సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవ్వగా హర్షకుమార్ ఏ పార్టీలో చేరుతారు అన్నది అప్పట్లో సస్పెన్స్ గా మారింది. ఆ టైంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నుండి ఆహ్వానం అందడంతో కాకినాడలో జరిగిన భారీ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లలో అమలాపురం పార్లమెంటు టిక్కెట్ ఆశించినా హర్ష కుమార్ కి… చంద్రబాబు ఆ టికెట్ ని దివంగత బాలయోగి కుమారుడికి కేటాయించడంతో….. కంగుతిన్న హర్షకుమార్ ఆ ఎన్నికల్లో టిడిపిని ఓడించాలని పిలుపునిచ్చి వెంటనే సైకిల్ దిగిపోయి సైలెంట్ అయిపోయారు. అయితే ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడంతో అనేక విషయాలలో దళిత ఉద్యమాలు చేయాలని ప్రయత్నించిన హర్ష కుమార్ కి ఆదిలోనే జగన్ సర్కార్ అరెస్టు చేసి దాదాపు 48 రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది.
అయితే జైలు నుండి బయటకు వచ్చాక కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా అధికార పార్టీపై చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన దళిత యువకుడి శిరోముండనం అదే రీతిలో దళిత బాలికపై అత్యాచారం మరియు చీరాలలో పోలీస్ దాడులలో దళిత యువకుడు ప్రాణాలు కోల్పవడం వంటి ఘటనలను ఆధారం చేసుకుని నేరుగా వైసీపీ ప్రభుత్వం పై ప్రత్యక్ష యుద్ధానికి దిగిపోయారు. అయితే ఈ సమయంలో తనకు అనుకూలంగా టీడీపీ శ్రేణులు నిలవడంతో పాటు ఆయన కూడా వారితో కొద్దిగా కలసిమెలసి నడుస్తున్న నేపథ్యంలో అనధికారికంగా టిడిపి పార్టీలోకి హర్షకుమార్ వెళ్లి పోయినట్లేనా అనే డిస్కషన్లు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నాయి. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక కోనసీమ ప్రాంతాలలో ఎక్కువ దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో హర్షకుమార్ చేస్తున్న ఉద్యమాలకు ఎక్కువ టీడీపీ సపోర్ట్ గా నిలవడంతో ఏపీ రాజకీయాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.