(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోది, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సోమవారం ఆయన మందడంలో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందనీ అందరూ ధైర్యంగా ఉండాలనీ ఆయన భరోసా ఇచ్చారు. మూడు రాజధానులనేది హాస్యాస్పదమని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, కేంద్రం అన్నీ గమనిస్తోందని రాయపాటి చెప్పారు.
అమరావతి ప్రాంతంలో ఒకే సామాజిక వర్గం అంటూ అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా రాజధాని రైతులకు మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు. మహిళలను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారనీ, అవసరమైతే నాలుగు రాళ్లు వారి మీద వేయండనీ అన్నారు. పోరాటం చేస్తున్న రాజధాని మహిళలకు ఆయన పాదాభివందనాలు తెలియజేశారు.