(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఆగాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ మూర్ఖంగా ముందుకెళ్తున్నారని విమర్శించారు.
హైకోర్టు ఉత్తర్వులు కాదని కర్నూలుకు కార్యాలయాలను తరలించడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖలో భూములు కొన్నవారు లాభపడేందుకే రాజధానిని తరలిస్తున్నారా అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని భావిస్తే సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
రాజధాని మార్పును కేంద్రం అంత సులభంగా ఒప్పుకునే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని 29 గ్రామాల రైతుల సమస్య కాదనీ, అయిదు కోట్ల ఆంధ్రుల సమస్య అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాలను కోర్టులూ అడ్డుకుంటాయని వడ్డే పేర్కొన్నారు.