రాష్ట్రంలో ఏదో ఒక అంశం పై రోజూ రాజకీయ చర్చలు జరుగుతూనే ఉన్నాయి, మంటలు చెలరేగుతూనే ఉన్నాయి…? ఏడాది కిందట ఎన్నికల్లో ఏకపక్ష నిర్ణయం వచ్చింది కానీ… మంటలు మాత్రం ఆగడం లేదు. అయితే తాజా మంటల్లో రాజ్యాంగ వ్యవస్థలో కీలక అధికారి ఎన్నికల కమిషనర్ కూడా మధ్యలో ఉండడం కలవరపరిచే అంశమే. గత నెలలో కమిషనర్ కేంద్రానికి రాసిన లేఖపై విజయసాయిరెడ్డి డిజిపికి పిర్యాదు చేస్తే… విచారణ తన వరకు రాకమునుపే స్పందించి రమేష్ తొందర పడ్డారా? లేక వివాదం ఎందుకని ముగించారా? అనేది చర్చనీయాంసంగా మారింది.
ఎన్నికల కమిషనర్ మార్పు, రమేష్ కుమార్ కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య గొడవ అంతా పక్కన పెడితే కేవలం లేఖ పై జరుగుతున్నయుద్ధం పై మాత్రమే మాట్లాడుకుందాం…!
విజయసాయిరెడ్డి పిర్యాదు వెనుక…!
గత నెలలోనే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రానికి ఒక లేఖ రాశారు. తనకు జగన్ అండ్ కో నుండి ముప్పు పొంచి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ భద్రతపై నమ్మకం లేదని, కేంద్ర బలగాలను పంపించి భద్రత పెంచాలని కోరారు. అది ఒరిజినలో, కాదో.., ఆయన రాసారో లేదో పక్కన పెడితే ఆయన కోరినట్టే కేంద్రం బలగాలను పెంచింది. తాజాగా రమేష్ కుమార్ తొలగింపు తర్వాత వైసిపి నాయకుడు విజయసాయిరెడ్డి ఆ లేఖ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆ లేఖ రమేష్ కుమార్ రాయలేదని… టిడిపి నాయకులు వార్ల రామయ్య , కనకమేడల రవీంద్ర ఇద్దరూ ఫోర్జరీ సంతకాలు చేసి కేంద్రానికి రాసారని డిజిపికి పిర్యాదు చేసారు. దీంతో కోర్టు గొడవ, కమిషనర్ మార్పు వ్యవహారాన్ని ఇటు మళ్లించారు. ఇప్పుడు చర్చ లేఖపైనే పడింది.
రమేష్ వెంటనే స్పందించాల్సిన అవసరం…?
విజయసాయిరెడ్డి పిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే రమేష్ కుమార్ స్పందించారు. ఆ లేఖ తానే రాశానని, ఫోర్జరీ కాదని ప్రకటించారు. ఇక్కడ కీలకంగా గుర్తించాల్సిన అంశం ఉంది. “విజయసాయిరెడ్డి పిర్యాదు చేశారు…, ఒకే..! దానిపై డిజిపి పట్టించుకుని స్పందించి కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు అనుకుందాం… ఒకే… అప్పుడు మొదట వచ్చేది రమేష్ కుమార్ దగ్గరకే. “మీ లేఖపై పిర్యాదు వచ్చింది. మీరు రాయలేదని, ఫోర్జరీ జరిగింది అని పిర్యాదు అందింది, మీరు రాశారా లేదా? అని కచ్చితంగా రమేష్ కుమార్ ని పోలీసులు ప్రశ్నిస్తారు. అప్పుడు ఈయన స్పందించి, నేనే రాసాను, ఫోర్జరీ కాదు అని చెప్పేస్తే సరిపోయేది. అసలు గొడవే ఉండేది కాదు.
ముందే కూసిన కోయిల…!
పోలీసులు విచారణకు కూడా రాకమునుపే, ఒక రాజకీయ వ్యవహారంపై రమేష్ కుమార్ స్పందించారు. వెంటనే ప్రకటించారు. ఇక్కడే మలుపు, మూలాలు అర్ధం చేసుకోవచ్చు. రమేష్ కుమార్ ఎవరు? ఏ పార్టీకి అనుకూలం? టిడిపి , వైసిపి రాజకీయ డ్రామాలు అనేవి పక్కన పెట్టేద్దాం.. ఇక్కడ మనం గుర్తించాల్సింది రమేష్ కుమార్ ముందే స్పందించడం. తన వరకు రాకమునుపే విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు వ్యతిరేకంగా, టిడిపి నేతలపై వచ్చిన ఆరోపణలు కొట్టివేసేలా ప్రకటన చేసారు. అదే ఇక్కడే కోయిల ముందే కూసింది…! ఒక రాజకీయ కోణంలో జరిగిన ఫిర్యాదుపై స్పందించి రమేష్ కుమార్ కాకను చల్లార్చే ప్రయత్నం చేశారా? లేదా వైసిపికి వ్యతిరేకంగా బయటకు వచ్చేసారా? టిడిపి తన వెనుక ఉన్నట్టు అంగీకరించినట్టేనా? వివాదం ఇష్టం లేక ఇలా ప్రకటన చేశారా? అనేది కొంత స్పష్టత వచ్చేసింది. కానీ రమేష్ కుమార్ పై వైసిపి వర్గాలకు అనుమానాలను పెంచింది.