అమరావతి, జనవరి 19: కోల్కతా ర్యాలీకి 20కిపైగా పార్టీలు పాల్గొన్నాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, రాష్ట్ర పార్టీ నేతలతో ‘ఎలక్షన్ మిషన్ 2019’పై చంద్రబాబు శనివారం టెలికాన్పరెన్స్ నిర్వహించారు.
కోల్కతా ర్యాలీకి బిజెపియేతర పక్షాల్లో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, వైసిపి అధ్యక్షుడు జగన్ హజరుకావడం లేదని, వీరు ప్రధాని వెంటే ఉన్నారని స్పష్టమవుతుందని చంద్రబాబు అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అసుల లేదు..అదొక శూన్యం మాత్రమేనని చంద్రబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు బిజెపి నేతలు ప్రకటించడం హస్యాస్పదంగా ఉందని, 29 సార్లు ఢిల్లీ వెళితే మొండిచేయి చూపడమే ప్రాధాన్యతా అని చంద్రబాబు ప్రశ్నించారు.
మోదికి మద్దతు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అది బిజెపికి ప్రతిపక్షమే కాదని అన్నారు. రాష్ట్రంపై టిఆర్ఎస్ నేతల ద్వేషాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. టిఆర్ఎస్తో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని ఎండగట్టాలని నేతలకు బాబు పిలుపు నిచ్చారు. వరంగల్లులో రాళ్లేసిన వార్లతో జగన్ లాలూచి పడ్డారని, కేసుల కోసం మోదీతో, ఆస్తుల కోసం కెసిఆర్తో జగన్ లాలూచి రాజకీయాలు చేస్తున్నారని బాబు అన్నారు.
బిజెపి దేశంలోని ఆలయాల్లో అశాంతిని సృష్టిస్తుందని, దీనికి శబరిమలలో ఉద్రిక్తతలే ఒక ఉదాహారణ అని చంద్రబాబు అన్నారు. కర్నాటకలో బిజెపి దుర్మార్గపు రాజకీయాలు చేస్తుందని అన్నారు. డబ్బు ఖర్చు పెట్టే అభ్యర్థుల కోసం వైసిపి వెతుకుతొందని, ఆ పార్టీ అభ్యర్థులు ప్రజల్లో ఉండే వారు కాదని బాబు అన్నారు.
రానున్న ఎన్నికల్లో 25 పార్లమెంట్, 150 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించేలా సమిష్టి కృషి చేయాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు.