నేటి సోషల్ మీడియా విస్తృతమవడంలో ఫేస్ బుక్ పాత్ర చాలా కీలకం. ఎక్కడెక్కడో ఉండిపోయిన ఫ్రెండ్స్ ను కలిపింది. కొత్త పరిచయాలను చేసింది. అనుభూతులు, జ్ఞాపకాలను పంచుకునేలా చేసింది. అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఇచ్చింది. అయితే.. స్వేచ్ఛని కాస్తా కొందరు విచ్చలవిడితనం చేసేశారు. సామాన్యుల నుంచీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం అటువంటి వివాదాలకు తావిస్తున్నారనే ఆరోపణలతో ఎమ్మెల్యే రాజాసింగ్ అకౌంట్ ను ఫేస్ బుక్ లాక్ చేయడం సంచలనం రేపుతోంది.
ఫేస్ బుక్ కి రాజకీయానికి లింక్ ఏంటి..?
గతంలో న్యూట్రాలిటీ వివాదం.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేస్తోందనే ఆరోపణలు వచ్చాయి. కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారంలో జుకర్ బర్గ్ క్షమాపణ చెప్పడం, వినియోగదారుల సమాచారం.. ఇలా అనేక మచ్చలు ఫేస్ బుక్ పై ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మంది వినియోగదారులున్న ఫేస్ బుక్ ఇప్పుడు భారత్ లో విమర్శలు ఎదుర్కొంటోంది. భారత్ లో బీజేపీకి సపోర్ట్ చేస్తోందని.. ఎఫ్ బీని బీజేపీ కంట్రోల్ చేస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించి సంచలనం రేపింది. స్నేహితులు, సరదా పోస్టులు ఉండాల్సింది.. రాజకీయాలకు వేదికైంది. రాజకీయ యాడ్స్ మాత్రమే కాకుండా రాజకీయ విద్వేషాలు కూడా సర్వసాధారణమయ్యాయి. తెలంగాణలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన చేసిన వీడియోలు, పోస్టులు వివాదాస్పదంగా ఉన్నా యాజమాన్యం చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు వచ్చాయి. మొత్తానికి విమర్శలు తట్టుకోలేక ఆయన అకౌంట్ ను తొలగించింది ఎఫ్ బీ.
ఫేస్ బుక్ భారత్ లో భయపడుతోందా..?
ఫేస్ బుక్ ఇండియా అధిపతి అంఖి దాస్ బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారనేది మాజీ, ప్రస్తుత ఉద్యోగులు చెప్తున్న మాట. కొందరు బీజేపీ నేతల వివాదాస్పద వీడియోలు, పోస్టులపై చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తుంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లలేమని, వ్యాపారంపై దెబ్బ పడుతుందనీ.. సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి భారత్ లో ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తోందంటూ వివాదాలు చుట్టుముట్టాయి. దీంతోనే రాజాసింగ్ అకౌంట్ ను డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఎవరి పోస్ట్ వివాదం రేపేదిగా ఉన్నా డిలీట్ చేయనుంది ఫేస్ బుక్. నవంబర్ లో జరిగే అమెరిక అధ్యక్ష ఎన్నికల యాడ్స్ వేయకూడదని ఎఫ్ బీ నిర్ణయం తీసుకుంది.