ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం 72 నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది.
ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసన్సోల్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద తృణమూల్ కార్యకర్తలు భద్రతాసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కేంద్రబలగాలు లేకుండానే పోలింగ్ నిర్వహించడాన్ని తృణమూల్ కార్యకర్తలు తప్పుబట్టారు. అనంతరం బిజెపి కార్యకర్తలు కూడా ఘర్షణకు దిగారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు పోలీసులు వారిపై లాఠీఛార్జ్ జరిపారు.
ఇదే పోలింగ్ కేంద్రం వద్ద బిజెపి అభ్యర్థి, కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కారుపై దాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన బాబుల్ సుప్రియోను కొందరు ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఘర్షణలో ఆయన కారు అద్దాలను పగలగొట్టారు.
అలాగే మధ్యప్రదేశ్లోని బలాఘాట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి కిశోర్ సమ్రైత్పై నక్సల్స్ దాడి చేసేందుకు ప్రయత్నించారు. తెల్లవారుజామున పోర్సా గ్రామంలోని ఆలయాన్ని దర్శించుకునేందుకు కిశోర్ వెళ్లారు. అదే సమయంలో దాదాపు 20 నుంచి 25 మంది సాయుధులైన మావోయిస్టులు ఆయన వాహనంపై దాడి చేశారు. అయితే అప్పటికే కిశోర్ పూజలు చేసేందుకు గుడి లోపలికి వెళ్లిపోయారు. దీంతో నక్సల్స్ ఆయన వాహనానికి నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయారు.
- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ చింద్వాడా నియోజకవర్గ పరిధిలోని శిఖర్పూర్లో ఓటేశారు.
- బిజెపి సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝాలావాడ్ పట్టణంలో ఓటు వేశారు.
- ఆర్బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముంబయి పెద్దార్ రోడ్లోని 40వ నెంబర్ పోలింగ్ బూత్లో ఓటేశారు
- కేంద్ర మాజీ మంత్రి, ఎన్సిపి అధినేత శరద్ పవార్ ముంబయి టార్డియో రోడ్డులోని 31వ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు
- ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ముంబయిలోని జిడి సొమానీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 216 నెంబరు పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.