(గాంధీనగర్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ (92) కన్నుమూశారు. నెల రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చికిత్స అనంతరం కరోనా నుండి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. గురువారం ఉదయం శ్వాస సంబంధమైన ఇబ్బంది ఏర్పడటంతో అహ్మదాబాద్లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కేశూభాయ్ పటేల్ రెండు పర్యాయాలు గుజరాజ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత నెలలోనే సోమనాధ్ మందిర్ ట్రస్ట్ కు రెండవ సారి అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. 1930 జూలై 24న జూనాఘడ్ జిల్లా విశావధర్ పట్టణంలో జన్మించిన కేశూభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత. గుజరాత్ కు 1995 మార్చి నుండి 1995 అక్టోబర్ వరకు మొదటి దఫా, 1998 మార్చి నుండి 2001 అక్టోబర్ వరకు రెండవ దఫా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2001లో గుజరాత్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం లభించలేదు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టీలో ఒత్తిడి రావడంతో ఆయన సీఎం పదవి నుండి తప్పుకున్నారు. 2012లో బీజేపీ నుండి బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ పార్టీ స్థాపించారు. 2012లో చివరి సారిగా ఎమ్మెల్యేగా గెలిచారు కేశూభాయ్ పటేల్. ఆ తరువాత ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అనారోగ్య కారణంగా 2014లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొత్తం కేశూభాయ్ పటేల్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు నలుగురు సంతానం. కేశూభాయ్ పటేల్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.