ఢిల్లీ: తెలంగాణాలో టిఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపియేనని మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. బిజెపిలో చేరిన డికె అరుణ ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న నాయకులను టిఆర్ఎస్ బలహీనపరుస్తుందని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజురుతోందని, గెలిచిన ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వలేకపోతోందని అరుణ అన్నారు. బలహీనపడుతున్న పార్టీలో ఉండి ప్రజా సేవ చేయలేమని ఈ కారణంగానే తాను బిజెపిలో చేరినట్లు పేర్కొన్నారు.
బిజెపి ద్వారానే తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులకు అణచివేస్తున్నారని, కలుపుగోలు తనం లేదని అరుణ ఆరోపించారు.
బిజెపి అధిష్టానం ఎక్కడి నుండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుండి పోటీ చేయడానికి సిద్ధమనీ, అయితే మహబూబ్నగర్ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అరుణ తెలిపారు.