హైదరాబాద్: తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. వారి ఆహ్వానానికి మోత్కుపల్లి సానుకూలంగా స్పందించినట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సోమవారం మోత్కుపల్లి కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
టీడీపీలో వేటు పడిన తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కొద్ది కాలంగా మోత్కుపల్లి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. అయితే, తనకు లభించే ప్రాధాన్యత పైనే మోత్కుపల్లి ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగించినట్లు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు తగిన ప్రాధాన్యత లభిస్తోందని పార్టీ నేతల నుండి హామీ వచ్చినట్లు తెలుస్తోంది.