గుంటూరు: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధమైతే రాజధాని ఇక్కడే ఉంటుందని అభిప్రాయపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. వారు రాజీనామాలు చేస్తే ఆయా స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి కూడా నిలబెట్టమని స్పష్టం చేశారు. రాజధాని విషయమై ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి నింపాలని సూచించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం మర్చిపోవడం దారుణమని మండిపడ్డారు. రైతుల మనస్సు గాయపరిచేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి ఉన్నంతకాలం భూములిచ్చిన రైతుల త్యాగాలను మర్చిపోరని పేర్కొన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే మూడు రాజధానులు ప్రకటన చేశారని విమర్శించారు. రాజధానిని మార్చిన చరిత్ర ఎప్పుడూ లేదన్నారు.
previous post