విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే దగ్గర నుంచి జరగాలన్నారు. రాజధానిని మారిస్తే 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో రైతులు, మహిళలు పోరాడుతున్నారని, వారికి రాష్ట్రంలోని 13 జిల్లాల రైతులు, మహిళలు మద్దతు పలకాలని కోరారు. విశాఖలో ప్రభుత్వ భూములు, క్రిస్టియన్ సంస్థల భూముల మీద జగన్ కన్ను పడిందని జలీల్ ఖాన్ ఆరోపించారు.
బోస్టన్ కమిటీకి రాజధానిపై అసలు అవగాహనా ఉందా? అని ప్రశ్నించారు. హైపవర్ కమిటీ అంటే మేధావులు.. రిటైర్ జడ్జిలు ఉంటారని, కానీ జగన్ ఏర్పాటు చేసిన కమిటీలో గొర్రెల మందలా అంతా వైసీపీ మనుషులే ఉన్నారని విమర్శించారు. వైసీపీ పాలనపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని సీఎం జగన్ కు సూచించారు. జగన్ అంటే ఉద్యోగులు భయపడుతున్నారన్నారు. అందుకే ఉద్యోగులు సైలెంట్ అయ్యారని పేర్కొన్నారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్ కి పాదాభివందనం చేస్తానని, నెత్తిన నీరు చల్లుకుంటానని జలీల్ఖాన్ చెప్పారు.