అనంతపురం: జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కొందరిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని జెసి ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇది మరింత ఎక్కువ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
74 సంవత్సరాలుగా ట్రాన్స్పోర్టు రంగంలో తనకు అనుభవం ఉందని ఆయన అన్నారు. దివాకర్ ట్రావెల్స్ ఒక్కటే నిబంధనలు అతిక్రమిస్తున్నదా అని ఆయన ప్రశ్నించారు. మిగిలిన ట్రావెల్స్ బస్సులు ఎన్ని సీజ్ చేశారని ఆయన అడిగారు. ట్రిబ్యునల్ బస్సులను వదిలిపెట్టమని చెప్పినా ఆర్టివో అధికారులు విడిచిపెట్టడం లేదని జెసి అన్నారు. రాష్ట్రంలో పరిపాలన హద్దు మీరుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనింగ్పైనా కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. పార్టీలో చేరమని చెబుతున్నారనీ, అలాగైతే కేసులు ఏమీ ఉండవని అంటున్నారని జెసి పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిన పరిస్థితులు ఉన్నాయని అధికారులు వాపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే సిఎస్ను బదిలీ చేసినట్లుగా తమకు జరుగుతుందని అదికారులు భయపడుతున్నారని జెసి అన్నారు.