అమరావతి, జనవరి 10: రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పరిధిలో లింగాయపాలెం వద్ద ఏర్పాటు చేస్తున్న వెల్కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సింగపూర్తో సమానంగా రాజధాని నిర్మాణం చేస్తానని ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ఆయన అన్నారు. రాజధాని ప్రణాళికతో పాటు ఇతర అంశాల్లోనూ ఆ దేశం సహకరిస్తుందని ఆయన చెప్పారు. అమరావతిలో నిర్మించే ఈ వెల్కం గ్యాలరీ చాలా మందికి అవకాశాలు కల్పిస్తుందని ఆయన అన్నారు.
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మధ్య బంధం బలపడుతొంది. రాజధాని నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లోనూ సహకారానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
సింగపూర్ నుండి పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా 15 కంపెనీలతో ప్రభుత్వానికి ఒప్పందాలు కుదిరాయి.