రాష్ట్రంలో రాజకీయం ఒక దశలో తిరుగుతుంటే.. గన్నవరంలో మాత్రం మరో దశలో తిరుగుతోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ అనధికారికంగా వైసీపీలో చేరిపోయారు. టీడీపీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటున్నారు. తానేంటో నిరూపించుకునేందుకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా కొత్త అస్త్రాలను బయటకు తీస్తోంది. ఈనేపథ్యంలో వల్లభనేని రాజీనామా చేస్తారా.. ఒకవేళ్ చేస్తే.. ఉప ఎన్నిక వస్తే.. స్థానిక వైసీపీ నాయకులుగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ఆయనకు మద్దతు ఇస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మిగిలింది. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
వంశీ రాజీనామా చేస్తారా.. లేదా?
సీఎం జగన్ ఓకే అంటే రాజీనామాకు సిద్ధం అంటూ వంశీ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఇందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకే వెళ్లని వైసీపీ.. పనిగట్టుకుని గన్నవరం ఉప ఎన్నికకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. అసలే అక్కడ వైసీపీ త్రిముఖంగా ఉంది. రీసెంట్ గా వల్లభనేని, యార్లగడ్డల చేయి చేయి కలిపారు సీఎం. అయినా.. స్థానిక పరిస్థితులపై సీఎం నమ్మకంగా లేరని అంటున్నారు. దీంతో వంశీ రాజీనామా ఇప్పట్లో ఉండదనే తెలుస్తోంది.
వంశీకి వీరంతా సహకరిస్తారా..?
గన్నవరంలో వైసీపీకి వీల్ చైర్ గేమ్ నడుస్తోంది. యార్లగడ్డ, దుట్టా.. వంశీకి ఎదురు నిలుస్తున్నారు. వంశీ టీడీపీలో ఉన్నప్పటి నుంచీ వీరి మధ్య వైరం అలానే కొనసాగుతోంది. ఇప్పుడు వైసీపీకి మారినా గత పరిస్థితులను వారు మరచిపోవడం లేదు. టీడీపీలో ఉండగా తమ మీద పెత్తనం చూపించిన వంశీని.. వైసీపీలో కూడా ఎమ్మెల్యేగా చేసుకుని తమ నెత్తి మీద కూర్చోపెట్టుకోలేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
టీడీపీ దేవినేని ఉమా రెడీ..!
గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే నిలబడేందుకు తాను సిద్ధమంటూ దేవినేని ఉమ ఇప్పటికే ప్రకటించారు. గన్నవరంలో టీడీపీకి బలం ఎక్కువ. ఇప్పటివరకూ 14 సార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారే ఓడిపోయింది. దీంతో గన్నవరం తమకు అత్యంత కీలకంగా టీడీపీ భావిస్తోంది. ఉప ఎన్నిక జరిగితే గన్నవరంలో గెలవాలని పట్టుదలగా ఉంది. చంద్రబాబును వల్లభనేని టార్గెట్ చేసిన విధానానికి టీడీపీ వంశీపై చాలా గుర్రుగా ఉంది. ఎప్పుడు ఆ పరిస్థితి వచ్చినా సిధ్దంగా ఉండేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది. మరి.. పరిస్థితులు ఎటు నడిపిస్తాయో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?