తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి వైసీపీ వైపు చూస్తూ ఆ పార్టీ లో అనధికారికంగా ముగ్గురు ఎమ్మెల్యే లు చేరిపోయిన విషయం తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు అధికారికంగా తెలుగుదేశం పార్టీని వీడి అనధికారికంగా జగన్ పంచన చేరారు. అయితే వైసీపీ కండువా వేసుకోవడానికి గానీ అసెంబ్లీ లో వైసీపీ సీట్ల లో కూర్చోవడానికి గానీ సాంకేతికంగా విప్ వీళ్లకు అడ్డం వస్తుంది. ఆ పార్టీ నుండి గెలిస్తేనే పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఆ పార్టీ తరపున కూర్చోగలరు. ఆ పార్టీ కండువా వేసుకోగలరు. అందుకు రాజీనామా చేసి గెలవడానికి వల్లభనేని వంశీ సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ఆయన రాజీనామా చేస్తే పరిస్థితులు తారుమారు అవుతాయని భయంతో రాజీనామా కు అయన వెనుకడుగు వేస్తున్నారుట. మద్దాల గిరిధర్ కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉన్నారుట. కానీ వల్లభనేని వంశీ మాత్రం రాజీనామా చేసి పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని తన అంతరంగికుల వద్ద, వైసీపీ పెద్దల వద్ద చెప్పారు. కానీ ఆయనకు ఒక విషయం వెనక్కు లాగుతోంది.
వంశీ రాజీనామా చేస్తే ఆరు నెలల లోపు ఉప ఎన్నిక పెట్టాల్సి వస్తుంది. రాజీనామా చేయడం, స్పీకర్ ఆమోదించడం, ఉప ఎన్నిక పెట్టడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. కానీ అక్కడ వంశీ గెలవడమే ముఖ్యం. వంశీ గెలువకుంటే వైసీపీ ప్రతిష్ట మసకబారుతోంది. రాజకీయంగా వంశీ కూడా అక్కడతో పతనానికి చేరుకుంటారు. అందుకే కచ్చితంగా గెలుస్తానని ధీమా ఉన్నప్పటికీ అక్కడ వైసీపీలో బలంగా ఉన్న ఒ వర్గం ఆయనకు నిప్పు పెడుతున్నట్లు తెలుస్తోంది. వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి అక్కడి వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మొదట్లో వ్యతిరేకించారు. దీంతో యార్లగడ్డ కు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చి శాంతింపచేసారు. అతని వర్గానికి కూడా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కొన్ని పనులు చేసి వారిని చల్లార్చారు. అయితే గన్నవరం లోనే ఓ సామాజిక వర్గంలో బలంగా నాటుకున్న రామచంద్ర రావు వర్గం వంశీకి పొగబెడుతోంది. ఒకవేళ వంశీ రాజీనామా చేసినా వైసీపీ తరపున పోటీ చేయడానికి వీల్లేదని, వాళ్లు అధిష్టానం వద్ద కండిషన్లు పెడుతున్నారట. గతంలో వంశీ జగన్ కువ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, వైసీపీకి వ్యతిరేకంగా బహిరంగంగా వంశీ చేసిన వ్యాఖ్యలు అవన్నీ చూసి కేవలం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టే వంశీ వచ్చారని, అతనిని నమ్మడానికి వీలు లేదని తేల్చి చెప్తున్నారుట. ఒకవేళ గన్నవరం ఉప ఎన్నిక అంటూ జరిగితే రామచంద్రరావు వర్గానికి చెందిన నాయకుడు లేదా అతని అల్లుడికే గన్నవరం సీటు ఇవ్వాలని పట్టు పడుతున్నారట. లేకపోతే ఎన్నికల్లో ఏమాత్రం సహకరించమని, వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారుట. దీంతో వంశీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. వంశీ రాజీనామా చేసి గెలవాలి అంటే పూర్తి స్థాయిలో శ్రేణుల నుండి మద్దతు ఉండాలి. అధికార పార్టీ కాబట్టి అధికారులు మద్దతు, పార్టీ మద్దతు, మంత్రుల మద్దతు ఉంటుంది. కానీ దిగువ స్థాయి నాయకులు, శ్రేణులు ఐకమత్యంతో పని చేస్తేనే వంశీ గెలుపు సులువు అవుతుంది. రాజకీయం గా తనకు అత్యంత కీలకమైన ఎన్నిక కాబట్టి ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వర్గాలను శాంతింపచేసి రాజీనామా వ్యవహారం పై ఒక అడుగు ముందుకు వేద్దాం అని వంశీ అనుకుంటున్నట్లు సమాచారం.