కృష్ణాజిల్లా గన్నవరం వైసిపి రాజకీయం గరంగరంగా మారింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొద్ది నెలల క్రితం టిడిపి నుండి దూరం జరిగి వైసిపికి దగ్గర అయిన సంగతి తెలిసిందే. వంశీ అధికారికంగా వైసిపిలో చేరకపోయినా ఆ పార్టీతో అనుబంధంగా కొనసాగుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. తొొలుత వల్లభనేని వంశీ వైసిపిలో చేరనున్నారని టాక్ వచ్చినప్పుడే ఆ నియోజకవర్గ వైసిపి ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే నాడు యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేరికను వ్యతిరేకించగా అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా వంశీని స్వాగతించారు. ఈ నేపథ్యంలో సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి యార్లగడ్డ వెంకట్రావును పిలిపించి శాంతింపజేశారు. ఆయన అసంతృప్తిని తీర్చడంతో కెడిసిసి చైర్మన్ పదవిని అప్పగించారు. దీనితో ఆయన కొంత వరకు శాంతించారు. అయితే ఇటీవల వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు ఆ నియోజకవర్గ వైసిపి వర్గాలలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. వైసిపి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. దీనికి తోడు తాజాగా నియోజకవర్గంలో తానే పార్టీ ఇన్ చార్జి పేర్కొంటూ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా తానే నంటూ వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ సీనియర్లకు ఆగ్రహాన్ని తెప్పించింది.
ఈ చర్యలతో అప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో ఎడ మొహం, పెడ మొహంగా ఉంటూ వస్తున్న నియోజకవర్గ వైసిపి ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావులు ఒకటి అయ్యారు. వంశీ చర్యల పట్ల వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు మీడియా ముందుకు వచ్చి వంశీని ఉద్దేశించి తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. తాను 40 ఏళ్లుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాననీ, వైసిపి ఆరంభం నుండి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాననిి పేర్కొన్నారు. వంశీ పదేళ్లు టిడిపిలో ఉన్న సమయంలో వైసిపి కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పుడు వంశీ వెంట పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇస్తూ తొలి నుండి వైసిపికి పని చేసిన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గన్నవరంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తానే పోటీ చేస్తాననీ, రౌడీలు, ప్యాక్షనిస్టులకు తాను భయపడనని పేర్కొన్నారు. తనకు యార్లగడ్డతో ఎటువంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. ఇటీవల కాలం వరకూ గన్నవరం ఎన్నికలు వస్తే వైసిపి తరపున దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డి పోటీ చేయనున్నారని ప్రచారం చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన దీనిపై మాట్లాడుతూ శివభరత్ రెడ్డికి పదవులు అవసరం లేదన్నారు. తానే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఒ సంచలన వ్యాఖ్య చేశారు. మరో 15 రోజుల్లో పార్టీ కార్యకర్తలకు ఓ చల్లని కబురు పార్టీ అధిష్టానం నుండి అందుతుందని చెప్పారు. దీంతో ఆ చల్లటి కబురు ఏంటి రాజకీయంగా చర్చ జరుగుతున్నది. సిఎం వైఎస్ జగన్ దుట్టాకు ఏమైనా హామీ ఇచ్చారా, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న యార్లగడ్డకు కెడిసిసి చైర్మన్ పదవి ఇచ్చినందున నియోజకవర్గ పార్టీ బాధ్యతలను దుట్టాకు అప్పగిస్తారని ఏమైనా హామీ ఇచ్చారా లేక ఇంకా ఏదైనా పదవి ఇస్తానని జగన్ నుండి హామీ లభించిందా అన్న ఊహాగానాలు నియోజకవర్గంలో సాగుతున్నాయి.
అధికార పార్టీలో చక్రం తిప్పవచ్చు అని వైసిపికి దగ్గర అయిన వల్లభనేని వంశీ అవకాశం చిక్కినప్పుడల్లా టిడిపి అధినేత చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వైసిపి ప్రభుత్వాన్ని, సిఎం జగన్ ను ప్రశంసిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుత నియజకవర్గంలో జరుగుతున్న ఈ పరిమాణాలు వంశీకి తలనొప్పిగా మారాయి. గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ఒక జట్టుగా ఉండగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒంటరి అయ్యారు. రాజీనామా చేసి ఎమ్మెల్యే మళ్లీ పోటీ చేసిన తన సత్తా చాటాలని అనుకుంటున్న ఆయన ఆశలకు ఈ పరిణామాలతో నీల్లు చల్లినట్లు అవుతోంది. వైసిపి అధిష్టానం గన్నవరం రాజకీయంపై దృష్టి సారించకపతే మూడు వర్గాలు, 33 సమస్యలుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. నియోజకవర్గంలో వంశీకి ఇటువంటి పరిస్థితి రావడం పట్ల తెలుగు తమ్ముళ్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి గ్రూపు రాజకీయాలను వైసిపి ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.