టీడీపీ ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు కొత్త చూపులు చూస్తున్నారు. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారంటూ అనేక పుకార్లు వస్తున్నాయి. ఆయన ఆగష్టు 9న లేదా 16న లేదా 22న వైఎస్సార్సీపీలో చేరుతారంటూ ముహూర్తాలు పెట్టేశారు. కానీ తేదీలు మారిపోయాయి కానీ ఏమీ జరగలేదు. వైఎస్సార్సీపీలో చేరదామనుకున్న గంటా ప్రస్తుతం సైలెన్స్ అయిపోయారు. ఆయనపై మరో కొత్త ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలోకి వెళ్తారంటూ కొత్త ప్రచారం జరుగుతోంది. ఎందుకా.. అని ఆరా తీస్తే..
అవంతి అడ్డు.. విజయసాయిరెడ్డితో విబేధాలు..
గంటా ఏపార్టీలో ఉంటే ఆపార్టీలో అజమాయిషీ చెలాయించే వ్యక్తి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో గంటా ఉంటారని పేరు. ఆయన రాజకీయ జీవితంలో ప్రతిపక్షంలో ఎప్పుడూ లేరు. ప్రస్తుతం ఆయనకు విశాఖపై పట్టు కావాలి. ఇందుకు ఆయన వైఎస్సార్సీపీలో చేరాలని ప్రయత్నాలు చేశారు. అయితే.. అవంతి రూపంలో ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అవంతి ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీలో చేరి ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆయనదే హవా. గంటాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గంటాకు మరోవైపు విజయసాయిరెడ్డి కూడా అంత సంతృప్తిగా లేరు. రెండు నెలల క్రితమే గంటా అవినీతిపై ట్వీట్ చేశారు కూడా. దీంతో గంటాకు రెండు వైపులా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీంతో ఒక కీలక వ్యక్తి సలహాతో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.
చిరు సలహా.. సామాజికవర్గం.. ఆసరా..
సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో తన మార్కు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష్యం ఏపీలోని కాపు నాయకులను బీజేపీలో చేర్చడం. రెడ్డి వర్గానికి జగన్, కమ్మ వర్గానికి చంద్రబాబులా.. రాష్ట్రంలో కాపు వర్గానికి బీజేపీ అండగా ఉంటుందనే భరోసా కాపుల్లో కలిగించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమేరకు కొత్త ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగానే అధ్యక్షుడయ్యాక చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను, ముద్రగడను కలిశారు. కాపు వర్గంలోని కీలకమైన వంగవీటి రాధాకృష్ణ, గంటా శ్రీనివాసరావులను పార్టీలో చేర్చుకుని బీజేపీని పటిష్టం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈమేరకే గంటాకు చిరంజీవి సలహా ఇచ్చారని కూడా అంటున్నారు. దీంతో గంటా వైఎస్సార్సీపీ కంటే బీజేపీ బెటర్ అని ఆలోచిస్తున్నారు. మరి.. ఆయన నిర్ణయమేంటో త్వరలో తేలబోతోంది. మొత్తానికి ఆయన మాత్రం టీడీపీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది.