Vizag Steel Plant.. వేదికగా రాజకీయం politics మొదలైందా..! అంటే ప్రస్తుత సమీకరణాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. భీకర ఉద్యమం, 32 మంది ప్రాణ త్యాగం ఫలితంగా ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారం చుట్టూ రాజకీయం మొదలవబోతోంది. ‘రంగస్థలంలో రాజకీయం మొదలవబోతోంది..’ అన్న రామ్ చరణ్ సినిమా డైలాగ్ ఇప్పుడు విశాఖలో పని చేయనుంది. ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి వైసీపీ, టీడీపీలు. ఈ అంశంలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామా చర్చనీయాంశమైంది. విశాఖ ఉక్కు మా హక్కు డైలాగ్ ను కొత్తగా.. విశాఖ ఉక్కు ఏపీ ప్రజల గుండె చప్పుడు.. అంటున్నారు. గంటా చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధి కేకే రాజు ఆమరణ నిరాహార దీక్షకు చేస్తామంటున్నారు. మొత్తంగా రాజకీయంగా సరికొత్త అంకానికి (నాటకానికి) తెర లేస్తోందనే చెప్పాలి.
Vizag Steel Plant : సూపర్ ప్లానింగ్ లో గంటా..
రెండేళ్ల క్రితం విశాఖలోనే ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించింది ఇదే కేంద్ర ప్రభుత్వం అప్పటి టీడీపీ హయాంలో మంత్రి హోదాలో ఉన్న గంటా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో.. అదే టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఉరుకుతున్నారు. ఈ రెండేళ్లలో ఆయన టీడీపీలో ఉన్నారో లేరో ప్రజలకే కాదు టీడీపీకే తెలీదు.. గంటాకు తప్ప. ఈ గ్యాప్ లో వైసీపీలోకి వెళ్లాలని ఊగిసలాడారు. బీజేపీకి గేలం వేసారని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే గంటా రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్నారు. రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తున్న గంటాకు.. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు విశాఖ ఉక్కు కర్మాగారం అంశం దొరికింది. దీంతో పోతే వెంట్రుక.. వస్తే కొండ అన్న చందాన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా అంటే కష్టం కానీ.. టీడీపీని వదిలేద్దామన్న ఉద్దేశం.. రాజకీయ ఉనికి కోసం తాపత్రయపడుతున్న గంటా ఈ అవకాశాన్ని వినియోగించేసుకుంటున్నారు.
గంటా పెట్టిన మెలిక..
గంటా రాజీనామా చేయడంతోపాటు ఓ చిన్న మెలిక పెట్టారు. స్పీకర్ కు పంపిన రాజీనామా లేఖలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించిన వెంటనే తన రాజీనామాను అమోదించాలని పేర్కొన్నారు. అంటే.. పూర్తిస్థాయిలో రాజీనామా కాదు.. వల వేసారు. పార్టీలకతీతంగా ఐకాస ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు చేసే జిమ్మిక్కులే గంటా కూడా చేశారని చెప్పాలి. మరోవైపు వైసీపీకి ఇది సంకటంగా మారింది. రాజధానిని విశాఖకు తరలించాలనే ఉద్దేశంలో ఉన్న సీఎం జగన్ కు విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంలా తగిలింది. వెంటనే అప్రమత్తమై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాసేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. విశాఖలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం అంటూ ప్రకటించింది. స్వతహాగా సమస్యలపై వెంటనే స్పందించి పోరాటాలు చేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం దీనిపై వెంటనే రియాక్ట్ అయి.. అవసరమైతే ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి మాట్లాడతానని ప్రకటించారు. చంద్రబాబు మాత్రం మరో మహోద్యమం తప్పదు అని మాత్రం ప్రకటన చేశారు. బీజేపీతో దోస్తీకి పాకులాడుతున్న చంద్రబాబు నుంచి ఇంతకుమించి ఊహించలేం కూడా. ప్రభుత్వంపై విరుచుకుపడే బీజీపీ నాయకుడు, మాజీ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిస్థితి మాత్రం సొంత పార్టీ నిర్ణయాన్ని సమర్ధించలేక.. వ్యతిరేకించలేక గుంభనంగా ఉండిపోయారు.
సీఎం జగన్ ఏం చేస్తారో..
మొత్తంగా కేంద్ర ప్రభుత్వంపై తీసుకొచ్చే ఒత్తిడిలో భాగంగా తన ఉనికిని చాటుకోవడం అని చెప్పాలి. అయితే.. ఉద్యమాలకు ఊపిరి పోస్తే ప్రభుత్వాలు దిగివచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్నింటిని చల్లార్చిన వైనం.. ప్రభుత్వం అనుకున్నదే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే.. తెలంగాణ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం తాను అనుకున్నదే చేసింది. ఏపీ విడిపోవడానికి ఒప్పుకునేది లేదు అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో కూడా ఇలానే చేస్తామని వైసీపీ ప్రభుత్వం అంటోంది. కానీ.. నీతిఅయోగ్ సూచన మేరకే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని కేంద్రం అంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ, కేంద్రం.. వీరిద్దరిలో ఎవరి ‘ఉక్కు’ సంకల్పం నెరవేరుతుందో చూడాల్సిందే.