రాజకీయాల్లో ఎప్పుడు ఎటువంటి మ్యాజిక్స్ జరుగుతాయో చెప్పడం కష్టం. ఒక్కోసారి ఒక్కో పార్టీ హవా ముందే తెలిసిపోతూ ఉంటుంది. 1995లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2014, 2018ల్లో తెలంగాణలో టీఆర్ఎస్, 2019లో వైసీపీ.. పార్టీల గాలి వీచిన సందర్భాలే. ఆయా సందర్భాల్లో ఓటింగ్ శాతం కూడా గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇదే విధంగా ఓటింగ్ ప్రభావం చూపింది. పోలింగ్ రోజున ప్రజలు ఓటింగ్ కు రాకపోవడంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఇదే పార్టీల గెలుపుపై ప్రభావం చూపిందని చెప్పాలి. టీఆర్ఎస్ కు తగ్గిన సీట్లు, బీజేపీకి పెరిగిన బలానికి ఓటింగ్ శాతమే శాసించిందని చెప్పాలి. 2016, 2020 ఓటింగ్ లో తేడాలను పరిశీలిస్తే..
2016–2020 మధ్య ఓటింగ్ తీరు..
2016లో టీఆర్ఎస్ కు 14,68,618 ఓట్లు.. 43.85 శాతం రాగా.. ప్రస్తుతం 12,04,167 ఓట్లు.. 35.56 శాతం ఓటింగ్ వచ్చింది. 2016లో బీజేపీకి 3,46,253 ఓట్లు.. 10.34 శాతం రాగా.. ప్రస్తుతం 11,95,711 ఓట్లు.. 35.56 శాతం ఓటింగ్ నమోదైంది. 2016లో ఎంఐఎంకు 5,30,812 ఓట్లు.. 15.85 శాతం రాగా, ప్రస్తుతం 6,30,866 ఓట్లు.. 18.76 శాతం ఓటింగ్ వచ్చింది. 2016లో కాంగ్రెస్ కు 3,48,388 ఓట్లు.. 10.40 శాతం రాగా, ప్రస్తుతం 2,24,528 ఓట్లు.. 6.67 శాతం ఓటింగ్ వచ్చింది. 2016లో టీడీపీకి 4,39,047 ఓట్లు.. 13.11 శాతం ఓటింగ్ రాగా, ప్రస్తుతం 55,662 ఓట్లు.. 1.66 శాతం ఓటింగ్ వచ్చింది. టీఆర్ఎస్ కు 2016 – 2020కి 2,64,451 ఓట్లు తగ్గాయి.
2023లో విజయానికి కష్టపడాల్సిందే..
ప్రస్తుతం టీఆర్ఎస్-బీజేపీ పార్టీల మధ్య ఓట్ల తేడా 8,456.. ఓటింగ్ శాతం 0.25 మాత్రమే. 2016లో దూసుకెళ్లిన టీఆర్ఎస్ కారుకు 2020లో బీజేపీ బాగానే బ్రేకులు వేసింది. ప్రజలు ఓటింగ్ కు రానప్పుడే టీఆర్ఎస్ కు బ్రేక్ పడబోతోందని దాదాపు అంచనాలు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకతను, నిజామాబాద్ ఎంపీ, దుబ్బాక ఉప ఎన్నిక విజయాలను కంటిన్యూ చేయాలన్న బీజేపీ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్ ను బలహీనం అయ్యేలా చేసిన కేసీఆర్ కు బీజేపీ తమకు మేకులా తయారవుతుందని ఊహించి ఉండరు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలంటే ఇప్పటినుంచే మేల్కోవాలి.. బీజేపీ గెలవాలంటే మరింత బలపడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?