గోవా: గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పారికర్ స్థానంలో మరొకరిని సీఎంగా ప్రకటించడానికి బిజెపి సిద్ధపడుతుండగా కాంగ్రెస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. సోమవారం రాష్ట్ర గవర్నర్ మృదుల సిన్హాను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్భవన్లో గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమదే అతిపెద్ద పార్టీ కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
‘మనోహర్ పారికర్ మృతికి మేము విచారిస్తున్నాం. కానీ ఆయన అంత్యక్రియల కన్నా ముందే గోవాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలో మాదే అతిపెద్ద పార్టీ అని గవర్నర్ గుర్తించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన గవర్నర్ మళ్లీ తమను సంప్రదిస్తామన్నారు’ అని చంద్రకాంత్ తెలిపారు.
పారికర్ సీఎంగా ఉంటారనే నిబంధన ప్రకారమే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మిగతా పార్టీలు అంగీకరించాయని చంద్రకాంత్ అన్నారు. ఇప్పుడు పారికర్ మన మధ్య లేరు. కాబట్టి బిజెపి సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అవకాశం లేదని చంద్రకాంత్ అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తమదే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అయినందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరినట్టు చంద్రకాంత్ చెప్పారు. గవర్నరే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. కానీ ఇప్పటికీ తాము ఆమె అపాయింట్మెంట్ కోసం కష్టపడాల్సి వస్తోందని చంద్రకాంత్ వివరించారు.
గోవా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 40. కాగా, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుభాశ్ శిరోద్కర్, దయానంద్ సోప్తి గత సంవత్సరం రాజీనామా చేశారు. బిజెపి ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా ఈ ఏడాది ప్రారంభంలో చనిపోయారు. ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోవా శాసనసభలో 36 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. బిజెపికి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్కు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీ(GFP), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(MGP)లకు చెరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వంతత్ర ఎమ్మెల్యేలు. ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP) ఎమ్మెల్యే ఉన్నారు. మరొకరు స్పీకర్గా ఉన్నారు.